Dhrmana Krishna Das: అమరావతే రాజధాని అంటూ చంద్రబాబు నాటకాలాడుతున్నారు: ధర్మాన కృష్ణదాస్

  • ఉత్తరాంధ్రుల శ్రమనంతా చంద్రబాబు హైదరాబాద్‌కు దోచిపెట్టారని విమర్శ
  • పాదయాత్రను జిల్లాలోకి అడుగుపెట్టనీయబోమని హెచ్చరిక
  • విశాఖను పరిపాలన రాజధానిగా మార్చేందుకు అవసరమైతే పదవులకు రాజీనామా చేస్తామన్న కృష్ణదాస్
YCP MLA Dhrmana Krishna Das Slams TDP Chief Chandrababu Naidu

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై నరసన్నపేట ఎమ్మెల్యే, జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖపట్టణాన్ని రాజధానిగా చేయడం చంద్రబాబు, ఆయన అనుచరులకు ఇష్టం లేదని అన్నారు. విశాఖను రాజధానిని చేయొద్దంటున్న ఆయనకు గట్టి సమాధానం ఇస్తామన్నారు. అప్పట్లో హైదరాబాద్ అభివృద్ధి అంటూ ఉత్తారాంధ్రుల శ్రమనంతా దోచిపెట్టారని, అక్కడ ఆస్తులు పెంచుకుని ఇప్పుడేమో అమరావతే రాజధాని అంటూ నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రులకు ఎన్నాళ్లీ హింస అని ప్రశ్నించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్ర ద్రోహులుగా మారారని అన్నారు. 

వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతే ఏకైక రాజధాని అని యాత్రగా వస్తున్న వారిని జిల్లాలో అడుగుపెట్టనివ్వబోమని తెగేసి చెప్పారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేసేందుకు అవసరమైతే పదవులకు రాజీనామా చేసేందుకు కూడా వెనుకాడబోమని కృష్ణదాస్ అన్నారు.

More Telugu News