Army: యుద్ధ ట్యాంకు బ్యారెల్ పేలి ఇద్దరు సైనిక సిబ్బంది దుర్మరణం

  • ఉత్తరప్రదేశ్ లోని బబీనా ఫైరింగ్ రేంజ్ లో ఘటన
  • సైనిక విన్యాసాలు చేస్తుండగా అపశృతి
  • గాయాలతో బతికిబయటపడ్డ ట్యాంకు డ్రైవర్
  • కమాండర్, గన్నర్ మృతి
Two army personnel died in battle tank barrel blast

ఉత్తరప్రదేశ్ లోని బబీనా సైనిక ఫైరింగ్ రేంజ్ లో అపశృతి చోటుచేసుకుంది. యుద్ధ ట్యాంకు బ్యారెల్ పేలి ఇద్దరు సైనిక సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. వారిలో ఒకరు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీవో). 

బుందేల్ ఖండ్ ప్రాంతంలోని ఈ సైనిక ఫైరింగ్ రేంజ్ లో అక్టోబరు 1 నుంచి మిలిటరీ విన్యాసాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా, గురువారం సాయంత్రం టీ-90 ట్యాంకుతో యుద్ధ విన్యాసాలు చేస్తుండగా, ఈ ఘటన జరిగింది. యుద్ధ ట్యాంకు గొట్టం ఒక్కసారిగా పేలిపోయింది. 

ప్రమాద సమయంలో ట్యాంకులో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. వీరిలో ట్యాంకు డ్రైవర్ గాయాలతో బతికి బయటపడ్డాడు. ట్యాంకు కమాండర్ సుమేర్ సింగ్ బగారియా (రాజస్థాన్), గన్నర్ సుకాంత మోండల్ (పశ్చిమ బెంగాల్) తీవ్రగాయాలతో మరణించారని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా, భారత సైన్యం దీనిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.

More Telugu News