Andhra Pradesh: కేసీఆర్ దోపిడీ సొమ్ముతో ఏపీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు పెడుతున్నారు: బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి

  • కేఏ పాల్ పార్టీకి, కేసీఆర్ పార్టీకి తేడా లేద‌న్న విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి
  • తెలుగు త‌ల్లికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాకే కేసీఆర్ ఏపీకి రావాల‌ని డిమాండ్‌
  • ఏపీ సాగునీటి ప్రాజెక్టుల‌పై కేసీఆర్ త‌న వైఖ‌రి చెప్పాల‌న్న బీజేపీ నేత‌
bjp leader vishnuvardhan reddy comments on kcr new party

తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ జాతీయ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన కేసీఆర్ తీరుపై బీజేపీ ఏపీ శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి శుక్ర‌వారం విమ‌ర్శలు గుప్పించారు. ఏపీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలసిన తీరుపై స్పందించిన ఆయ‌న‌...కేసీఆర్ దోపిడీ సొమ్ముతోనే ఏపీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు పెడుతున్నార‌ని ఆరోపించారు. ఓ స్ప‌ష్ట‌మైన విధానం ప్ర‌క‌టించకుండానే కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి ఎలా ప్ర‌వేశిస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కేఏ పాల్ పార్టీకి, కేసీఆర్ పార్టీకి ఏమాత్రం తేడా లేద‌ని కూడా ఆయ‌న ఎద్దేవా చేశారు. 

తెలుగు త‌ల్లికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన త‌ర్వాతే కేసీఆర్ ఏపీలోకి అడుగుపెట్టాల‌ని విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి అన్నారు. తెలంగాణ‌లో ఎంద‌రో మ‌హ‌నీయుల విగ్ర‌హాల‌ను ధ్వంసం చేసిన కేసీఆర్‌.. ఆ కుటుంబాల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని క‌ర్ణాట‌క‌, మహారాష్ట్ర, త‌మిళ‌నాడు, ఏపీల్లోకి ఎలా తీసుకువ‌స్తారో చెప్పాల‌న్నారు. దేశాన్ని ఏకం చేస్తాన‌ని చెబుతున్న కేసీఆర్‌... ఏపీలోని సాగునీటి ప్రాజెక్టుల‌పై త‌న వైఖ‌రిని ప్ర‌క‌టించాల‌ని ఆయ‌న కోరారు. ఏపీతోనే వివాదాలు క‌లిగిన కేసీఆర్ జాతీయ స్థాయిలో మిగిలిన పార్టీల‌ను ఎలా మెప్పిస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

More Telugu News