Chiranjeevi: చిరూ 154వ సినిమా నుంచి రానున్న ఆసక్తికరమైన అప్ డేట్!

  • షూటింగు దశలో చిరూ 154వ సినిమా 
  • పరిశీలనలో 'వాల్తేర్ వీరయ్య' టైటిల్
  • మెగాస్టార్ తో జోడీ కడుతున్న శ్రుతి హాసన్  
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
Chiranjeevi and bobby movie update

ఈ సారి చిరంజీవి దసరా బరిలో తన జోరు చూపిస్తున్నారు. ఆయన తాజా చిత్రంగా వచ్చిన 'గాడ్ ఫాదర్' విడుదలైన అన్ని ప్రాంతాల్లో భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా పట్ల, మెగా అభిమానులు ఖుషీగా ఉన్నారు. తొలిరోజునే ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. చిరంజీవి తన ఇమేజ్ కి భిన్నంగా చేసిన ప్రయోగం ఫలించిందనే టాక్ బలంగానే వినిపిస్తోంది. 

ఈ నేపథ్యంలో దీపావళికి చిరంజీవి తన 154వ సినిమా అప్ డేట్ తో సందడి చేయనున్నట్టుగా సమాచారం. చిరంజీవి తన 154వ సినిమాను బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, 'వాల్తేర్ వీరయ్య' అనే టైటిల్ ను ఖరారు చేయనున్నారనే టాక్ ఉంది. 

ఈ సినిమా నుంచి దీపావళికి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వదలనున్నట్టు చెబుతున్నారు. ఫస్టు గ్లింప్స్ ను గానీ .. టీజర్ ను గాని వదిలే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని చెబుతున్నారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

More Telugu News