KCR: కుమార‌స్వామి, తిరుమాళ‌వ‌న్ తో ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో సీఎం కేసీఆర్ అల్పాహారం

  • బీఆర్ ఎస్ ఆవిర్భావ ప్ర‌క‌ట‌న‌ స‌భ‌లో పాల్గొనేందుకు హైద‌రాబాద్ చేరుకున్న ఇరువురు నేత‌లు
  • నేడు తెలంగాణ భ‌వ‌న్‌లో పార్టీని ప్ర‌క‌టించనున్న సీఎం కేసీఆర్‌
  • టీఆర్ఎస్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశానికి 283 మందికి ఆహ్వానం
karnataka former cm kumaraswamy met with cm kcr at pragathi bhavan

ద‌స‌రా పండుగ‌ను పుర‌స్క‌రించుకుని టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్య‌మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మ‌రికాసేప‌ట్లో జాతీయ పార్టీ ఆవిర్భావ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. హైద‌రాబాద్‌లోని టీఆర్ఎస్ ప్ర‌ధాన కార్యాల‌యం ఇందుకు వేదిక కానుంది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ సర్వసభ్య సమావేశం జ‌రుగుతుంది. సర్వసభ్య సమావేశానికి మొత్తం 283 మంది ప్రతినిధులకు ఆహ్వానం పంపారు. సమావేశంలో పార్టీ పేరు మార్పుపై తీర్మానం, సంతకాల సేకరణ చేపట్టనున్నారు. అనంత‌రం భార‌తీయ రాష్ట్ర స‌మితి (బీఆర్ ఎస్‌) ఆవిర్భావంపై కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. 

ఈ స‌మావేశానికి ప్ర‌త్యేక ఆహ్వానితులుగా కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమాళవన్ హాజ‌ర‌వుతారు. ఈ ఇద్ద‌రు నేత‌లు ఇప్ప‌టికే హైద‌రాబాద్ చేరుకున్నారు. బుధవారం ఉద‌యం ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో సీఎం కేసీఆర్‌తో స‌మావేశం అయ్యారు. కుమార‌స్వామితో పాటు పలువురు జేడీయూ ఎమ్మెల్యేలు ఆయ‌న వెంట వ‌చ్చారు. తిరుమాళవన్‌ ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి ప్రగతి భవన్‌కు వచ్చారు. వీరితో క‌లిసి సీఎం కేసీఆర్ అల్పాహారం చేశారు. మ‌రోవైపు జాతీయ పార్టీ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో తెలంగాణ నలుమూలల నుంచి టీఆర్‌ఎస్‌ నేతలు భారీ సంఖ్య‌లో నగరానికి చేరుకుంటున్నారు.

More Telugu News