Team India: గువాహటిలో పరుగుల వర్షం... సఫారీ బౌలింగ్ ను చీల్చిచెండాడిన టీమిండియా బ్యాట్స్ మెన్

  • టీమిండియా మొదట బ్యాటింగ్
  • 20 ఓవర్లలో 3 వికెట్లకు 237 పరుగులు
  • అర్ధసెంచరీలు చేసిన సూర్యకుమార్, కేఎల్ రాహుల్
  • రాణించిన కోహ్లీ, రోహిత్ శర్మ
  • దినేశ్ కార్తీక్ దూకుడు
  • విలవిల్లాడిన దక్షిణాఫ్రికా బౌలర్లు
Team India batsmen smashes South Africa bowlers in Guwahati

గువాహటిలో టీమిండియా టాపార్డర్ బ్యాట్స్ మెన్ వీరవిహారం చేశారు. రెండో టీ20లో దక్షిణాఫ్రికా బౌలింగ్ ను చీల్చిచెండాడారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ నుంచి దినేశ్ కార్తీక్ వరకు బౌండరీల వర్షం కురిపించారు. ముఖ్యంగా 'మిస్టర్ 360' సూర్యకుమార్ యాదవ్ ధాటికి దక్షిణాఫ్రికా బౌలర్లు బెంబేలెత్తిపోయారు. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 237 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కేఎల్ రాహుల్, కెప్టెన్ రోహిత్ శర్మ తొలి వికెట్ కు 96 పరుగులు జోడించి అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. రాహుల్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్ లతో 57 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 37 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో 43 పరుగులు చేశారు. వీరిద్దరినీ కేశవ్ మహరాజ్ అవుట్ చేశాడు. 

ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ చిచ్చరపిడుగులా చెలరేగిపోయాడు. సఫారీ బౌలింగ్ ను ఊచకోత కోస్తూ కేవలం 18 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. మొత్తం 22 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్ 5 ఫోర్లు, 5 సిక్సులతో 61 పరుగులు చేసి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. 

మరో ఎండ్ లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫామ్ ను కొనసాగిస్తూ 28 బంతుల్లో 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. కోహ్లీ స్కోరులో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. చివర్లో వచ్చిన దినేశ్ కార్తీక్ కూడా ఎక్కడా తగ్గకుండా, సఫారీ బౌలింగ్ లో విరుచుకుపడ్డాడు. దినేశ్ కార్తీక్ 7 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 17 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టుకు ఆ నిర్ణయం బెడిసికొట్టింది. టీమిండియా టాపార్డర్ దెబ్బకు దక్షిణాఫ్రికా బౌలర్లు కుదేలయ్యారు. రబాడా ఒక్క వికెట్ తీయకపోగా, 4 ఓవర్లలో ఏకంగా 57 పరుగులు సమర్పించుకున్నాడు. వేన్ పార్నెల్ (54 పరుగులు), ఎంగిడీ (49 పరుగులు), ఆన్రిచ్ నోర్జే (3 ఓవర్లలో 41 పరుగులు) అదే బాటలో నడిచారు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఒక్కడే కాస్తంత ఫర్వాలేదనిపించాడు. మహరాజ్ 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.

More Telugu News