Bandi Sanjay: ద్రౌపది ముర్మును ఓడించేందుకు ప్రయత్నించిన కేసీఆర్ ఎస్టీల గురించి మాట్లాడడం సిగ్గుచేటు: బండి సంజయ్

  • ఉప్పల్ లో బండి సంజయ్ పాదయాత్ర
  • ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ల అంశం ప్రస్తావన
  • ఎస్టీలు కేసీఆర్ ను నమ్మరని వ్యాఖ్యలు
  • అన్ని స్కాంలలో కేసీఆర్ కుటుంబం ఉందన్న సంజయ్  
Bandi Sanjay fires on CM KCR over ST reservations

తెలంగాణ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉప్పల్ పాదయాత్రలో ఆయన మాట్లాడుతూ, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే కేసీఆర్ పురుగులు పడి పోతాడని శాపనార్థాలు పెట్టారు. బీజేపీపై నెపం నెట్టి, సుప్రీంకు వెళ్లి స్టే తీసుకురావాలన్నదే టీఆర్ఎస్ పన్నాగం అని బండి సంజయ్ విమర్శించారు. 

రాష్ట్రపతి ఎన్నికల వేళ కాంగ్రెస్ తో కలిసి ద్రౌపది ముర్మును ఓడించేందుకు ప్రయత్నించిన కేసీఆర్ ఎస్టీల గురించి మాట్లాడడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. ఎస్టీ ఆడబిడ్డను రాష్ట్రపతిని చేద్దామనుకుంటే, ఆ ఆడబిడ్డను ఓడించే ప్రయత్నం చేశాడని మండిపడ్డారు. సీఎంను ఎస్టీలు ఎంతమాత్రం నమ్మరని స్పష్టం చేశారు. 

సచివాలయానికి అంబేద్కర్ పేరుపెట్టిన కేసీఆర్... కొత్త సచివాలయంలో ఒక కుర్చీ వేసి దళితుడ్ని సీఎంగా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పట్టించుకోని ఏకైక సీఎం కేసీఆరేనని అన్నారు. తడిగుడ్డతో గొంతు కోసే మూర్ఖుడు అని పేర్కొన్నారు. 

లిక్కర్ కుంభకోణం సహా అన్ని స్కాంలలో కేసీఆర్ కుటుంబం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. సీబీఐ అంటే చాలు వారికి కాలు విరుగుతుంది, ఈడీ అంటే కరోనా వస్తుంది అని సెటైర్లు వేశారు. క్వారంటైన్ పేరుతో ఏ స్కాంకు స్కెచ్ వేస్తున్నారో? అంటూ ఎద్దేవా చేశారు.

More Telugu News