Nepal: నేపాల్‌ను అతలాకుతలం చేస్తున్న వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 17 మంది దుర్మరణం

  • నేపాల్‌లో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు
  • కొండచరియల కింద చిక్కుకున్న మరో 11 మంది
  • గల్లంతైన మరో ముగ్గురి కోసం హెలికాప్టర్లతో గాలింపు
At least 17 people killed in landslides triggered by rains in Nepal

పొరుగుదేశం నేపాల్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సుదర్‌పశ్చిమ్ ప్రావిన్సులో కుండపోతగా కురుస్తున్న వానలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. కొండచరియల కింద చిక్కుకున్న మరో 11 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. క్షతగాత్రులను హెలికాప్టర్లలో సుఖేత్ జిల్లాలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఈ ఘటనలో మరో ముగ్గురు గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. వారి కోసం హెలికాప్టర్లతో గాలిస్తున్నారు. కొండచరియలు విరిగి రోడ్లపై పడడంతో పలు ప్రాంతాల్లో రవాణాకు అంతరాయం ఏర్పడింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

More Telugu News