50S age: 50 ఏళ్లు దాటాక జీర్ణశక్తిని పెంచుకునేందుకు అనుసరించాల్సిన మార్గాలివీ..!

  • 50 ఏళ్లు దాటిన వారిలో వృద్ధాప్య లక్షణాలు, జీర్ణ శక్తి బలహీనత
  • ఫైబర్ ఎక్కువున్న ఆహారం, ఉప్పు తగ్గించడంతో ప్రయోజనం
  • వ్యాయామం, ప్రోబయాటిక్ ఫుడ్ తీసుకోవడం మంచిదని నిపుణుల సూచన
  • తగినన్ని నీళ్లు తప్పనిసరిగా తాగాలని వివరణ
Tips for better digestion after 50s

సాధారణంగా 45-50 ఏళ్లు దాటగానే శరీరంలో వృద్ధాప్య లక్షణాలు కనబడటం మొదలవుతుంది. వ్యాయామం, మంచి ఆహార అలవాట్లు ఉన్నవారు మినహా చాలా మందిలో వయసు మీద పడుతోందన్నది స్పష్టంగా తెలిసిపోతుంటుంది. శరీరానికి వ్యాయమం తగ్గడం, ఎక్కువసేపు కూర్చుని ఉండటం, మారిన ఆహార అలవాట్లు, ఊబకాయం, మధుమేహం, ఇతర అనారోగ్యాల వల్ల శరీరం బలహీనం అవుతుంటుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. తిన్నది సరిగా అరగని పరిస్థితి చాలా మందిలో కనిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే 50 ఏళ్లు దాటినవారు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా జీర్ణ వ్యవస్థ బాగా పనిచేసేందుకు వీలు ఉంటుందని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు..

ఫైబర్‌ (పీచు పదార్థాలు) ఎక్కువగా ఉండే ఆహారం
 50 ఏళ్లు దాటినవారిలో మల బద్ధకం సమస్య ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పీచు పదార్థాలు (ఫైబర్‌) ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పండ్లు, తాజా కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలని.. దీనివల్ల అటు ఫైబర్‌ అందడంతోపాటు ఇటు చెడు కొవ్వు శరీరంలో చేరకుండా ఉంటుందని సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయల్లోని విటమిన్లు, ఇతర పోషకాలు శరీర ఆరోగ్యానికి కూడా తోడ్పడుతాయని వివరిస్తున్నారు.

రంగు రంగుల పండ్లు, కూరగాయలు తీసుకోండి
ఐదు పదుల వయసు దాటినవారు ఆహారం రంగులమయంగా ఉండేలా చూసుకోవాలని వైద్యులు, పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అంటే ఆకుపచ్చ, ఎరుపు, నారింజ, పసుపు ఇలా భిన్న రంగుల పండ్లు, కూరగాయలు ఆహారంలో ఉండాలని చెబుతున్నారు. భిన్న రంగుల కూరగాయలు, పండ్లలో వేర్వేరు ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయని.. జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేందుకు తోడ్పడతాయని వివరిస్తున్నారు. ఇవి ఆహారం బాగా జీర్ణం కావడానికి తోడ్పడటంతోపాటు మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయని స్పష్టం చేస్తున్నారు.

ఉప్పు తగ్గించండి
 వయసు పెరిగిన కొద్దీ శరీరం మరింత సెన్సిటివ్‌ గా మారుతుందని.. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఆహారం సరిగా జీర్ణం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఉప్పు, మసాలాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల ఇతర అనారోగ్య సమస్యలూ దూరంగా ఉంటాయని వివరిస్తున్నారు.

తప్పనిసరిగా వ్యాయామం చేయాలి
యుక్త వయసు దాటిన వారిలో దాదాపు అందరికీ వ్యాయామం అవసరం. అయితే 50 ఏళ్లు దాటిన వారికి మాత్రం మరింత ఎక్కువగా అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుందని, రక్త ప్రసరణ బాగుంటుందని.. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని వివరిస్తున్నారు.

అవసరమైన మేర నీళ్లు తాగాలి
 వయసు పెరుగుతున్న కొద్దీ శరీరానికి నీటి అవసరం పెరుగుతుందని.. లేకుంటే చర్మం పొడిబారడం దగ్గరి నుంచి ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో తగినంత నీటి శాతం లేకుంటే జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు వస్తాయని.. అందువల్ల అవసరమైన మేర నీళ్లు తాగడం మంచిదని స్పష్టం చేస్తున్నారు.

క్యాల్షియం అందేలా చూసుకోవాలి
 వయసు పెరిగిన కొద్దీ ఎముకలు బలహీనంగా మారుతాయని, రక్త హీనత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్త హీనత వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందని వివరిస్తున్నారు. తగినంతగా క్యాల్షియం అందేలా చూసుకుంటే.. ఈ సమస్య నుంచి బయటపడవచ్చని, జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటుందని పేర్కొంటున్నారు.

ప్రోబయాటిక్స్‌ తీసుకోవాలి
ఆహారాన్ని జీర్ణం చేయడానికి, విటమిన్లు, ప్రోటీన్లను శరీరం శోషించుకోవడానికి.. జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా ఎంతో తోడ్పడుతుంది. ఈ మంచి బ్యాక్టీరియా మరింత వృద్ధి చెందడానికి, ఆరోగ్యంగా ఉండటానికి పెరుగు వంటి ప్రోబయాటిక్స్‌ ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో లభించే ఫెర్మెంటెడ్‌ ఉత్పత్తులను కూడా తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

వైద్యుల సలహా తీసుకోవాలి
50 ఏళ్లు దాటినవారిలో మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు మొదలయ్యే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారికి ఈ ఇబ్బంది ఎక్కువ. అందువల్ల ఆహారంలో మార్పులు చేసుకున్నప్పుడు వైద్యుల సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

More Telugu News