Chandrababu: మహిళల గౌరవాన్ని బజారుకీడుస్తున్న లోన్ యాప్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు

  • లోన్ యాప్ ల ఆగడాలకు ప్రజలు బలి
  • నిన్న రాజమండ్రిలో దంపతుల ఆత్మహత్య
  • నేడు పల్నాడులో యువకుడి బలవన్మరణం
  • సమస్యకు చావు పరిష్కారం కాదన్న చంద్రబాబు
Chandrababu reacts to deaths due to loan apps harassment

ఏపీలో లోన్ యాప్ నిర్వాహకుల అరాచకాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. లోన్ యాప్ ల వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న రాజమండ్రిలో దంపతుల ఆత్మహత్య ఘటన మరువకముందే ఇవాళ పల్నాడులో మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. 

ముఖ్యంగా మహిళల గౌరవాన్ని బజారుకీడుస్తూ వేధిస్తున్న ఇలాంటి లోన్ యాప్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. అంతేతప్ప, ఇలాంటి సమస్యలకు చావు పరిష్కారం కాదని హితవు పలికారు. ప్రభుత్వం, పోలీసులు కూడా ఇటువంటి యాప్ ల గురించి ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు. బాధితులకు అండగా నిలిచి మనోధైర్యాన్ని ఇవ్వాలని తెలిపారు.

More Telugu News