Kerala: జస్ట్​ ఒక్క రోజులో 81 కోర్సులు పూర్తి చేసి రికార్డు సృష్టించిన భారత మహిళ!

  • కేరళలోని కొట్టాయంకు చెందిన రెహనా షాజహాన్ సృష్టించిన ఘనత
  • ఆన్ లైన్ విధానంలో ఫేస్ బుక్, గూగుల్, అమెజాన్ వంటి కంపెనీల నుంచి షార్ట్ టర్మ్ కోర్సులు
  • సర్టిఫికెట్ సాధించేందుకు అన్ని కోర్సుల్లో అవసరమైన మార్కులు సాధించి రికార్డు
kerala woman who completed 81 certificates in a day to earn world record

ఏదైనా కాస్త సుదీర్ఘంగా చదవాలంటేనే కష్టం. ఇక పుస్తకం పడితే చాలు నిద్ర వచ్చేస్తుందనేవారు ఎందరో, ఇంటర్నెట్ వచ్చాక ఆన్ లైన్ లో అయినా సరే.. ఏదైనా చదవాలంటే బోరు కొట్టేస్తుంది. చదవడానికి, ప్రిపేర్ కావడానికి ఓ గంట సేపు కంప్యూటర్‌ ముందు కూర్చోవడమే కష్టం. కానీ మన దేశానికే చెందిన మహిళ రెహనా షాజహాన్ మాత్రం.. 24 గంటలు గట్టిగా ప్రయత్నం చేసి ఏకంగా 81 కోర్సులను పూర్తి చేసి రికార్డు సృష్టించింది.

మునుపటి రికార్డును దాటేసి.. 

రెహనా సోదరి ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతోంది. ఆమెలా సెంట్రల్‌ యూనివర్సిటీలో చదవాలన్న ఆశయంతో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఎంకామ్‌ ఎంట్రన్స్‌ రాసింది. కానీ సగం మార్కు తేడాతో అడ్మిషన్‌ కోల్పోయింది. ఏడాది సమయం వృధా చేయడం ఎందుకని డిస్టెన్స్  కోర్సులు చేసింది. 

తర్వాతి ఏడాది జామియాలో ఎంబీఏ సీటు సంపాదించి పూర్తి చేసింది. కొవిడ్‌ టైమ్‌ లోనే ఆమె ఎంబీఏ అయిపోయింది. ఇంటర్వ్యూలకు వెళ్తున్నప్పుడు కొవిడ్‌ టైమ్‌ ను ఎలా ఉపయోగించుకున్నావని అడిగితే.. అందరిలా గుంపులో ఒకరిగా మిగిలిపోగూడదని.. ఎంబీఏ పూర్తవగానే ఆన్ లైన్ కోర్సులు చేయడం మొదలుపెట్టానంది.

ఓసారి ఒకే రోజులో 55 ఆన్‌లైన్‌ కోర్సులు పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఆమె పనిచేసిన సంస్థ సీఈఓతో చెబితే.. వరల్డ్‌ రికార్డ్‌ కు ప్రయత్నం చేయాలని సలహా ఇచ్చారు. అప్పటికి ప్రపంచ రికార్డు 24 గంటల్లో 75 కోర్సులుగా ఉంది. దీనితో ప్రయత్నం మొదలుపెట్టిన రెహనా.. 24 గంటల్లో 81  కోర్సులు పూర్తి చేసి.. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది.

అయితే, దుబాయ్‌ లోని ఓ కంపెనీలో హెచ్‌ ఆర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న రెహనా తన తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడం ఇటీవలే ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియా వచ్చేసింది. ఇక్కడ విద్యార్థులకు కెరీర్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ కోచ్‌ గా పనిచేస్తూ.. ఆన్‌ లైన్‌ కోర్సులు చేయడంపై శిక్షణ ఇస్తోంది.

More Telugu News