Bihar: మణిపూర్‌లో నితీశ్ కుమార్ జేడీయూకు ఎదురుదెబ్బ.. ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనం

  • గత 9 రోజుల్లో రెండోసారి నితీశ్‌కు షాక్
  • ఆరుగురు ఎమ్మెల్యేలలో ఐదుగురి విలీనం
  • ఆమోదించిన స్పీకర్
  • మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లు ‘జేడీయూ ముక్త్’గా మారుతున్నాయన్న సుశీల్ మోదీ
Nitish Kumars JDU faces setback in Manipur

బీహార్‌లో బీజేపీతో కటీఫ్ చేసుకుని ఆర్జేడీ చేయి అందుకున్న జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మణిపూర్‌లో ఆ పార్టీకి ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఐదుగురు బీజేపీలో విలీనమయ్యారు. ఆ వెంటనే నితీశ్‌ను ఉద్దేశించి బీజేపీ నేత, ఎంపీ సుశీల్ మోదీ ట్వీట్ చేస్తూ.. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ‘జేడీయూ ముక్త్’గా మారుతున్నాయని సెటైర్ వేశారు.

జేడీయూ ఎమ్మెల్యే విలీనాన్ని మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. నితీశ్ కుమార్‌కు ఎదురుదెబ్బలు తగలడం గత 9 రోజుల్లో ఇది రెండోసారి. ఆగస్టు 25న అరుణాచల్ ప్రదేశ్ జేడీయూ ఎమ్మెల్యే టెకి కసో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. 2019లో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో జేడీయూ ఏడు సీట్లను గెలుచుకుంది. ఆ తర్వాత అందులో ఆరుగురు శాసనసభ్యులు బీజేపీలో చేరారు. ఆగస్టు 25న ఆ మిగిలిన ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరడంతో అక్కడ జేడీయూ ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

More Telugu News