KCR: అవినీతిపరుల బూట్లు మోసే సన్నాసులు తెలంగాణలో ఉన్నారు: సీఎం కేసీఆర్

  • పెద్దపల్లిలో టీఆర్ఎస్ సభ
  • మోదీ పైనా, బీజేపీపైనా విమర్శలు
  • శ్రీలంకలో మోదీని గో బ్యాక్ అన్నారని ఎద్దేవా 
  • విద్యుత్ మీటర్లు పెడతామంటున్న మోదీకే మీటర్ పెట్టాలని పిలుపు 
CM KCR fires on PM Modi and BJP

తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీపైనా, బీజేపీపైనా మరోసారి ధ్వజమెత్తారు. పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ సభలో ఆయన మాట్లాడుతూ, దేశ ఆర్థిక స్థితిని, రూపాయి విలువను కేంద్రం దిగజార్చిందని అన్నారు. కేంద్రం అడ్డగోలు ధరల పెంపుతో ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేయమంటే కేంద్రానికి చేతకాదని అన్నారు. 

శ్రీలంక వెళ్లిన ప్రధాని మోదీని గో బ్యాక్ అన్నారని వెల్లడించారు. దేశంలో రైతులు వ్యవసాయానికి వాడే విద్యుత్ 20.8 శాతం మాత్రమేనని కేసీఆర్ వివరించారు. మోటార్లకు మీటర్లు పెట్టాలన్న మోదీకి మీటర్ పెట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో సాగు రంగానికి వాడే విద్యుత్ ఖరీదు రూ.1.45 లక్షల కోట్లు అని, అది కార్పొరేట్ దొంగలకు దోచిపెట్టినంత సొమ్ము కాదని అన్నారు. ఎన్ పీఏల పేరుతో రూ.12 లక్షల కోట్లు దోచిపెట్టారని ఆరోపించారు. రైతులకు ఇవ్వడానికి మాత్రం కేంద్రానికి చేతులు రావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సింగరేణి ప్రైవేటీకరణ కుట్రను భగ్నం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ అవినీతి గద్దలు దేశాన్ని నాశనం చేస్తున్నాయని మండిపడ్డారు. అవినీతిపరుల బూట్లు మోసే సన్నాసులు తెలంగాణలో ఉన్నారని వ్యాఖ్యానించారు. 

దేశం యావత్తు తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతి వైపు చూస్తోందని తెలిపారు. జాతీయ రాజకీయాల్లోకి రావాలని రైతు సంఘాల నేతలు తనను కోరారని సీఎం కేసీఆర్ వెల్లడించారు. దేశంలో బీజేపీని పారద్రోలి రైతు ప్రభుత్వం రాబోతోందని పేర్కొన్నారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

More Telugu News