Asia cup: కోహ్లీ, పాండ్యాను కలిసిన ‘మారో ముఝే మారో’ మీమ్​ క్రియేటర్​

  • ఆసియా కప్ హాజరైన  పాక్ అభిమాని మోమిన్ సాకిబ్
  • ‘మారో ముఝే మారో’ మీమ్స్ తో పాప్యులర్ అయిన మోమిన్
  • అతడిని ఆప్యాయంగా పలుకరించిన కోహ్లీ, పాండ్యా
Maaro Mujhe Maaro boy meets Kohli and Pandya after India vs Pakistan

2019 వన్డే ప్రపంచ కప్ లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయిన తర్వాత ‘మారో ముఝే మారో’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేసి సోషల్ మీడియాలో పాప్యులర్ అయిన పాక్ అభిమాని మోమిన్ సాకిబ్ గుర్తున్నాడా? అప్పట్లో అతను అన్న ఆ మాట మీమ్ చాలా పాప్యులర్ అయ్యింది. మోమిన్ కూడా ‘మారో ముఝే మారో’ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా అతను భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాను కలిశాడు. ఆసియాకప్ లో భాగంగా ఆదివారం దుబాయ్ లో జరిగిన భారత్, పాక్ మ్యాచ్ కు అతను హాజరయ్యాడు. 

ఈ సారి కూడా భారత్ చేతిలో పాక్ ఓడిపోవడం నిరాశ కలిగించినా.. భారత క్రికెటర్లను ప్రత్యక్షంగా కలుసుకునే అదృష్టం అతనికి లభించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ, పాండ్యాతో కరచాలనం చేసి, వారితో మాట్లాడిన వీడియోలను మోమిన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తొలి మ్యాచ్ లో పాక్ ఓడిపోయినా .. ఇరు జట్లూ మళ్లీ ఫైనల్లో తలపడాలని అతను కోరుకున్నాడు. కోహ్లీ కలిసిన వీడియోను షేర్ చేసి.. ‘గొప్ప క్రీడాకారుడు. ఎంతో వినయపూర్వక వ్యక్తి. మీరు మళ్లీ ఫామ్ లోకి రావడాన్ని చూడటం ఆనందంగా ఉంది. ఈ రాత్రి ఆట అద్భుతంగా సాగింది. దేవుడి దయతో మనం మళ్లీ ఫైనల్లో కలుద్దాం’ అని మోమిన్ రాసుకొచ్చాడు. 

 ఇక, హార్దిక్ పాండ్యా కొట్టిన విన్నింగ్ సిక్సర్ ను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని చెప్పాడు. ‘మ్యాచ్ నువ్వా? నేనా? అన్నట్టు సాగింది. అంతగా అనుభవం లేనప్పటికీ మా యువ బౌలర్లు అద్భుతంగా రాణించి గట్టి పోటీనిచ్చారు. కానీ, మీరు గొప్పగా బ్యాటింగ్ చేశారు. మీ సిక్సర్ ను మర్చిపోను సోదరా’ అంటూ హార్దిక్ పాండ్యాను కలిసిన వీడియోను షేర్ చేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొచ్చాడు. 

More Telugu News