NV Ramana: పదవీ విరమణకు ఒకరోజు ముందు కీలక తీర్పునిచ్చిన సీజేఐ ఎన్వీ రమణ... జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు గ్రీన్ సిగ్నల్

  • ఆగస్టు 26న పదవీవిరమణ చేయనున్న జస్టిన్ ఎన్వీ రమణ
  • జర్నలిస్టుల ఇళ్ల స్థలాల వ్యవహారంలో విచారణ
  • పాత్రికేయులకు అనుకూలంగా తీర్పు
  • నిర్మాణాలు జరుపుకోవచ్చంటూ శుభవార్త
  • హర్షం వ్యక్తం చేస్తున్న పాత్రికేయ వర్గాలు
CJI NV Ramana clears journalist society lands case

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆగస్టు 26న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో, పదవీ విరమణకు ఒకరోజు ముందు ఆయన కీలక తీర్పు ఇచ్చారు. హైదరాబాదులో జర్నలిస్టు సొసైటీ ఇళ్ల స్థలాలకు సంబంధించిన వ్యవహారంలో పాత్రికేయులకు అనుకూల తీర్పును వెలువరించారు. 

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణాలకు పచ్చజెండా ఊపారు. ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్లకు ఇళ్ల స్థలాల వ్యవహారంతో పాత్రికేయులకు ఇళ్ల స్థలాల వ్యవహారం ముడిపెట్టరాదని స్పష్టం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై తాను వ్యాఖ్యలు చేయడంలేదని, కానీ ఓ చిరు పాత్రికేయుడు ఎందుకు ఇబ్బంది పడాలి? అని సూటిగా ప్రశ్నించారు

8 వేల మంది జర్నలిస్టుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని ఈ తీర్పు వెలువరిస్తున్నామని సీజేఐ తెలిపారు. జర్నలిస్టులకు భూమి కేటాయించినా అభివృద్ధి చేయలేదని, జర్నలిస్టులంతా కలిసి ఆ భూమి కోసం రూ.1.33 కోట్లు డిపాజిట్ చేశారని, ఆ స్థలాన్ని జర్నలిస్టులు స్వాధీనం చేసుకునేందుకు అనుమతిస్తున్నామని స్పష్టం చేశారు. ఆ స్థలంలో పాత్రికేయులు నిర్మాణాలు కూడా జరుపుకోవచ్చని శుభవార్త చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్, ప్రజాప్రతినిధులకు ఇళ్ల స్థలాల వ్యవహారాన్ని మరో బెంచ్ ముందు విచారణకు తీసుకువస్తామని పేర్కొంటూ, ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 

హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్

కాగా, ఈ తీర్పుపై పాత్రికేయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం వెలువరించిన తీర్పును ఆనందోత్సాహాలతో స్వాగతిస్తున్నారు. అటు, తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ తీర్పుపై స్పందించారు. తెలంగాణ జర్నలిస్టు సొసైటీ ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి సుదీర్ఘకాలంగా విచారణలో ఉన్న ఈ కేసును పరిష్కరించినందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ తీర్పు వల్ల, పాత్రికేయ మిత్రులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు వీలు కలుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.

More Telugu News