Andhra Pradesh: అమ్మకానికి ఏపీలోని 10 బంగారు గనులు.. ఈ నెలలోనే వేలం!

  • స్థూల జాతీయోత్పత్తిలో మైనింగ్ రంగం వాటా పెంచాలని కేంద్రం నిర్ణయం
  • బంగారు గనుల విక్రయానికి మార్చిలోనే నోటిఫికేషన్ విడుదల
  • ఏపీలో ఈ నెల 26, 29న రెండు విడతలుగా వేలం
Union govt to sell 13 Gold mines across country

స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో మైనింగ్ రంగం వాటా పెంచాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న 13 బంగారు గనులను విక్రయించాలని నిర్ణయించింది. ప్రభుత్వం విక్రయించనున్న గనుల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 10 గనులు ఉండగా, మిగతా మూడు ఉత్తరప్రదేశ్‌లో ఉండడం గమనార్హం. గనుల  కొనుగోలుకు సంబంధించి ఆసక్తిగల వారి నుంచి టెండర్లు ఆహ్వానిస్తూ మార్చి 21న కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.

 2015లో గనుల చట్టాన్ని సవరించడం ద్వారా గనుల వేలం ప్రక్రియకు రాష్ట్రాలు శ్రీకారం చుట్టాయి. అందులో భాగంగా 199 మినరల్ బ్లాక్‌లు వేలం వేశాయి. గత ఆర్థిక సంవత్సరంలోనూ 45 మినరల్ బ్లాక్‌లు విక్రయించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు 13 బంగారు గనులను విక్రయించడం ద్వారా జీడీపీలో మైనింగ్ రంగం వాటా పెంచాలని కేంద్రం నిర్ణయించింది. 

ఏపీలో విక్రయించనున్న గనుల్లో రామగిరి నార్త్‌ బ్లాక్‌, బొకసంపల్లి నార్త్‌ బ్లాక్‌, బొకసంపల్లి సౌత్‌ బ్లాక్‌, జవకుల-ఎ, జవకుల-బి, జవకుల-సి, జవకుల-డి, జవకుల-ఒ, జవకుల-ఎఫ్‌ బ్లాక్‌లు ఉన్నాయి. వీటిలో 5 గనులకు ఈ నెల 26న, మిగతా ఐదింటికి 29న వేలం నిర్వహించనున్నారు. అలాగే, యూపీలోని మూడు గనులు.. సోనాపహాడి బ్లాక్‌, సోనాభద్రలోని ధ్రువ-బైదానంద్‌ బ్లాక్‌ల కోసం వేలం నిర్వహించనున్నప్పటికీ ఎప్పుడు వేలం వేసేది తేదీని వెల్లడించలేదు.

More Telugu News