Rajasthan: దేశవ్యాప్తంగా పశువులను వణికిస్తున్న ‘లంపీ’ డిసీజ్.. రాజస్థాన్‌లో 12 వేలకుపైగా పశువుల మృతి

  • గుజరాత్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ వ్యాధి విజృంభణ
  • పశువుల సంతలపై రాజస్థాన్ నిషేధం
  • ఈ వ్యాధి సోకితే పశువుల్లో జ్వరం, చర్మంపై గడ్డలు
  • లాలాజల స్రావాలు ఎక్కువై మరణం
Rajasthan Government Bans Animal Fairs to Control Lumpy Skin Disease

దేశవ్యాప్తంగా పశువులు ‘లంపీ’ అనే చర్మవ్యాధి బారినపడి విలవిల్లాడుతున్నాయి. దీని బారినపడి ఒక్క రాజస్థాన్‌లోనే దాదాపు 12వేల పశువులు మృతి చెందాయి. లంపీ వ్యాధి చెలరేగిపోతుండడంతో అప్రమత్తమైన రాజస్థాన్ ప్రభుత్వం పశువుల సంతలపై నిషేధం విధించింది. రాజస్థాన్‌లో ఇప్పటి వరకు 2,81,484 పశువులకు లంపీ వ్యాధి సోకింది. వీటిలో ఇప్పటి వరకు 2,41,685 పశువులకు చికిత్స అందించారు.

ఈ నెల పదో తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 12,800 పశువులు ఈ వ్యాధి బారినపడి ప్రాణాలు కోల్పోయాయి. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో లంపీ వ్యాధి తీవ్రంగా ఉన్నప్పటికీ, పరిస్థితి మాత్రం అదుపులోనే ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి పీసీ కిషన్ తెలిపారు. రాజస్థాన్ తర్వాత గుజరాత్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, అండమాన్ నికోబార్, ఉత్తరాఖండ్‌లలో ఈ వ్యాధి ప్రబలంగా ఉంది.

లంపీ చర్మవ్యాధి గోట్‌పాక్స్, షీపాక్స్ కుటుంబానికి చెందినది. కాప్రిపాక్స్ వైరస్ కారణంగా ఇది సోకుతుంది. ఈ వైరస్ సోకిన పశువులు జర్వం బారినపడతాయి. వాటి చర్మంపై గడ్డలు ఏర్పడతాయి. ఆ తర్వాత బరువును కోల్పోతాయి. పాల దిగుబడి పడిపోతుంది. అనంతరం శ్వాస, లాలాజల స్రావాలు ఎక్కువై మరణిస్తాయి. ఈ వైరస్‌కు ఇప్పటి వరకు ఎలాంటి చికిత్స లేదు. అయితే, ఉపశమనం కోసం యాంటీబయోటిక్స్‌ను ఉపయోగిస్తున్నారు.

More Telugu News