Roja: వందలాది ఫొటోగ్రాఫర్లు ఏకకాలంలో మంత్రి రోజాను క్లిక్ మనిపించిన వైనం... వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు

  • విజయవాడలో ఫొటోగ్రఫీ కార్నివాల్
  • హాజరైన మంత్రి రోజా
  • కార్యక్రమంలో అరుదైన ఘట్టం ఆవిష్కరణ
  • ఒక ఫొటో తన జీవితాన్ని మార్చిందన్న రోజా
Hundreds of photographers clicked minister Roja in Photography Carnival

ఏపీ మంత్రి రోజా విజయవాడలో నిర్వహించిన ఫొటోగ్రఫీ కార్నివాల్-ఎక్స్ పో కార్యక్రమంలో సందడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వందలమంది ఫొటోగ్రాఫర్లు ఏకకాలంలో మంత్రి రోజాను ఫోటో తీశారు. ఈ అరుదైన ఘట్టం వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, ఇంతమంది ఫొటోగ్రాఫర్లు ఒకేవేదికపైకి రావడం సంతోషం కలిగిస్తోందని, వాళ్లందరూ ఒకేసారి తనను ఫొటో తీయడం మరపురాని అనుభూతి కలిగిస్తోందని అన్నారు. 

ఇవాళ్టి సమాజంలో కెమెరా మూడో కన్ను వంటిదని, కెమెరా లేకపోతే చరిత్ర లేదని, భవిష్యత్ ఉండదని అభిప్రాయపడ్డారు. 

కాగా, తన సినీ ప్రస్థానం మొదలవడానికి ఒక ఫొటోనే కారణమని రోజా ఆసక్తిక అంశాన్ని వెల్లడించారు. తెలిసీ తెలియకుండా ఓ ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటో తనకు సినిమా అవకాశం తెచ్చిపెట్టిందని చెప్పారు. ఆ ఫొటో చూసి, తనను చూడకుండానే ప్రేమ తపస్సు చిత్రంలో అవకాశం ఇచ్చారని రోజా వివరించారు.

More Telugu News