Aswinidutt: ఫ్యామిలీతో థియేటర్ కు వచ్చే ప్రేక్షకులకు విరక్తి పుట్టించారు: నిర్మాత అశ్వనీదత్ ధ్వజం

  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నిర్మాత
  • సినీ రంగ సమస్యలపై స్పందన
  • హీరోల పారితోషికంలో తప్పుబట్టడానికేమీ లేదని వెల్లడి
  • అశ్వనీదత్ వ్యాఖ్యలతో ఏకీభవించిన బండ్ల గణేశ్
Aswini Dutt comments on Industry

ప్రస్తుతం సినిమా రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర పరిస్థితులపై సీనియర్ నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థియేటర్ కు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గిందని అన్నారు. కొందరు సీఎంలతో మాట్లాడి టికెట్ రేట్లు పెంచుకున్నారని అన్నారు. అసలు ఈ రేట్లు పెరగకముందే ఓ వర్గం ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యారని వివరించారు. కొందరు గొలుసుకట్టు థియేటర్లను తీసుకుని వాళ్లే సమోసాలు, కూల్ డ్రింకులు అమ్ముకుంటూ, రేట్లు భారీగా పెంచేశారని, దాంతో ఫ్యామిలీతో థియేటర్ కు వచ్చే ప్రేక్షకులకు విరక్తి పుట్టించారని అశ్వనీదత్ వివరించారు. 

ఈ లోపు ఓటీటీలు వచ్చేశాయని అన్నారు. థియేటర్లలో సినిమాలు విడుదల కాకుండా, కేవలం ఓటీటీల్లో చేసుకుంటూ పోతే సినిమాలు తీయడం కూడా కష్టమైపోతుందని అభిప్రాయపడ్డారు. ఇక, హీరోలకు ఎవరిష్టం వచ్చినంత పారితోషికం వారు ఇస్తున్నారని, దీంట్లో అడగడానికేమీ లేదని అన్నారు. హీరోల పారితోషికం పెరగడం వల్లే టికెట్ రేట్లు పెరిగాయన్న వాదన సరికాదని అన్నారు. 

అప్పట్లో ఎంఎస్ రెడ్డి, డీవీఎస్ రాజు, అట్లూరి పూర్ణచందర్ రావు తదితరులు మద్రాసులో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ స్థాపించారని, మధ్యలో ఈ గిల్డ్ ఎందుకు వచ్చిందో (ప్రొడ్యూసర్స్ గిల్డ్), ఏం సాధించడానికి వచ్చిందో తెలియదని అశ్వనీదత్ విమర్శనాత్మకంగా స్పందించారు. అప్పట్లో ఎలాంటి సమస్యలనైనా ఫిలిం చాంబరే పరిష్కరించేదని ఆయన పేర్కొన్నారు.  

కాగా, నిర్మాత అశ్వనీదత్ వ్యాఖ్యలపై నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు. 50 సంవత్సరాలుగా నిర్మాణ రంగంలో ఉన్న అశ్వనీదత్ గారి వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. ఏ హీరోని, ఏ దర్శకుడిని రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని అడిగే అర్హత ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఒక్కో మోడల్ కారుకు ఒక్కో రేటు ఉంటుందని, అలాగే అందరూ హీరోలే అయినా, ఒక్కొక్కరికి ఒక్కో రేటు ఉంటుందని వివరించారు. 

ఇవాళ కాల్షీట్లకు, షీట్లకు తేడా తెలియనివాళ్లు, షూటింగ్ ఎన్నింటికి మొదలవుతుందో, ఎన్నింటికి ప్యాకప్ అవుతుందో తెలియనివాళ్లు, ఏ రోజు ఏ లైట్లు వాడుతున్నారో తెలియనివాళ్లు, ఏ లొకేషన్ కు ఎంత చార్జి అవుతుందో తెలియనవాళ్లు కూడా సినిమాలు తీస్తున్నారని బండ్ల గణేశ్ ఎద్దేవా చేశారు. సినిమా రంగంలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ అనవసరం అనీ, ఒక ఫిలిం చాంబర్, ఒక కౌన్సిల్ సరిపోతుందని అభిప్రాయపడ్డారు. సినిమాలు తీయని వాళ్లు కూడా గిల్డ్ లో ఉంటారని, వాళ్లకేం తెలుసని బండ్ల గణేశ్ ప్రశ్నించారు.

More Telugu News