Polavaram Project: పోల‌వ‌రం కాఫ‌ర్ డ్యాం ఎత్తు పెంచుతూ ఏపీ స‌ర్కారు తాజా నిర్ణ‌యం

  • ఎడ‌తెరిపి లేని వ‌ర్షాల‌తో గోదావ‌రికి పోటెత్తిన వ‌ర‌ద‌
  • ఎగువ కాఫ‌ర్ డ్యామ్ వ‌ద్ద ప్ర‌స్తుతం 20 ల‌క్ష‌ల క్యూసెక్కుల వ‌ర‌ద‌
  • శ‌నివారంలోగా 28 ల‌క్ష‌ల క్యూసెక్కుల‌కు పెర‌గ‌నున్న వ‌ర‌ద‌
  • మీట‌రు మేర ఎత్తు పెంచాల‌ని ప్ర‌భుత్వ నిర్ణ‌యం
  • కాఫ‌ర్ డ్యామ్ ను పటిష్ఠ‌ప‌రిచే ప‌నుల‌కూ గ్రీన్ సిగ్న‌ల్‌
  • యుద్ధ ప్రాతిప‌దిక‌న ప‌నుల‌ను మొద‌లుపెట్టిన ప్ర‌భుత్వం
ap government decides to increase hight of upper cofer dam in polavaram project

ఏపీలో కీల‌క ప్రాజెక్టు పోల‌వ‌రంలోని ప్ర‌ధాన నిర్మాణం ఎగువ కాఫ‌ర్ డ్యామ్ ఎత్తు పెంచుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం శుక్ర‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఎగువ కాఫ‌ర్ డ్యామ్‌ను పటిష్ఠ‌ప‌ర‌చ‌డంతో పాటుగా ఎత్తును పెంచాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం 42.5 మీట‌ర్ల ఎత్తుతో ఎగువ కాఫ‌ర్ డ్యామ్‌ను నిర్మించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ డ్యామ్ ఎత్తును మ‌రో మీట‌రు మేర పెంచాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఫ‌లితంగా ఎగువ కాఫ‌ర్ డ్యామ్ మొత్తం ఎత్తు 43.5 మీట‌ర్ల‌కు చేరుకోనుంది. ఎత్తును పెంచ‌డంతో పాటుగా కాఫ‌ర్ డ్యామ్‌ను రెండు మీట‌ర్ల వెడ‌ల్పున మ‌ట్టి, ఇసుక‌తో పటిష్ఠ‌ప‌ర‌చాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. 

ఇక ఎత్తు పెంపు, డ్యామ్ పటిష్ఠ‌ప‌రిచే ప‌నుల‌ను ప్రభుత్వం శుక్ర‌వార‌మే యుద్ధ ప్రాతిపదిక‌న మొద‌లుపెట్టింది. గ‌త కొన్ని రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా గోదావ‌రికి వ‌ర‌ద నీరు పోటెత్తింది. ఫ‌లితంగా ఎగువ కాఫ‌ర్ డ్యామ్, స్పిల్ వే ఛానెల్‌ వ‌ద్ద 20 ల‌క్ష‌ల క్యూసెక్కుల వ‌ర‌ద ప్ర‌వ‌హిస్తోంది. ఈ వ‌ర‌ద శ‌నివారంలోగా 28 ల‌క్ష‌ల క్యూసెక్కుల‌కు పెరిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కాఫ‌ర్ డ్యామ్‌కు ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌కుండా ఉండేలా ఎత్తు పెంపు నిర్ణ‌యాన్ని తీసుకున్న ప్ర‌భుత్వం ప‌నుల‌ను కూడా ప్రారంభించింది.

More Telugu News