KCR: కేంద్ర ప్రభుత్వ కుటిల యత్నాలపై పార్లమెంటులో పోరాటం.. టీఆర్ఎస్ ప్రకటన

Struggle in Parliament against Central Governments Crooked Attempts CM KCR to Give Directions to Party MPs
  • ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలు
  • ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సమావేశం
  • తెలంగాణ పట్ల అనుసరిస్తున్న తీరుపై నిలదీయాలని సూచించనున్న సీఎం  
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై పోరాడాలని, ఇందుకోసం పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకోవాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు టీఆర్ఎస్ ఎంపీలకు సూచనలు చేయనున్నారు. ఈ నెల 18 నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్నాయి. దీంతో ఉభయ సభల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన విధి విధానాలపై దిశానిర్దేశం చేసేందుకు శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతిభవన్ లో పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ట్విట్టర్, ఫేస్ బుక్ లలో టీఆర్ ఎస్ పార్టీ వివరాలను వెల్లడించింది.

ప్రోత్సహించాల్సింది పోయి ఇబ్బంది పెడుతున్నారంటూ..
‘‘తెలంగాణకు అన్ని రంగాల్లో నష్టం చేసే విధంగా బీజేపీ సర్కారు తీరు ఉందని, దీనిపై పార్లమెంటు ఉభయ సభల్లో తీవ్ర నిరసన ప్రకటించాలని, పోరాటానికి పూనుకోవాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఆర్ధిక క్రమశిక్షణను పాటిస్తూ అనతి కాలంలో అభివృద్ధి పథంలో పయనిస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించాల్సింది పోయి ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయాలని కేంద్రం కుటిల ప్రయత్నాలు చేస్తుండటాన్ని నిలదీయాలని.. బీజేపీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ సూచించనున్నారు. తెలంగాణ రైతుల ధాన్యాన్ని కొనకుండా రైతులు, మిల్లర్లు, ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు పిలుపునివ్వనున్నారు..” అని టీఆర్ఎస్ పార్టీ పేర్కొంది.

ద్వంద్వ వైఖరిని నిలదీయాలంటూ..
‘‘ఉపాధి హామీ పథకాన్ని పటిష్ఠంగా అమలు చేస్తున్న తెలంగాణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న పొంతనలేని ద్వంద్వ వైఖరిని, దుర్మార్గ విధానాన్ని నిలదీయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణలో ఉపాధి హామీ పథకం గొప్పగా అమలవుతున్న తీరు, సోషల్ ఆడిట్ లను కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ప్రశంసించింది, అవార్డులు ఇచ్చింది. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్న తీరును నిలదీయాలని ఎంపీలకు సీఎం సూచించనున్నారు” అని టీఆర్ఎస్ తెలిపింది.

రూపాయి పతనంపై కేంద్రాన్ని నిలదీయాలి..
‘‘ఆర్థిక రంగంలో కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలతో రోజురోజుకూ దేశ ఆర్థిక వ్యవస్థ పతనమౌతున్నదని ఆర్థిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు. క్షీణిస్తున్న రూపాయి విలువే అందుకు నిదర్శనంగా దేశ ప్రజలు భావిస్తున్నారు. దేశ అభివృద్ధి సూచి రోజురోజుకూ పాతాళానికి చేరుకుంటున్న పరిస్థితుల్లో దేశాన్ని ఆర్థిక సంక్షోభం బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులుగా తెలంగాణ ప్రజలకు ఉందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దీనిని ప్రతిబింబించేలా రూపాయి పతనంపై కేంద్రాన్ని ఉభయ సభల సాక్షిగా నిలదీయాలని ఎంపీలకు సూచించనున్నారు. ఇదే సమయంలో కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై టీఆర్ఎస్ చేస్తున్న పోరాటంలో కలిసివచ్చే ఇతర రాష్ట్రాల ఎంపీలను కూడా కలుపుకుపోవాలని వివరించనున్నారు” అని టీఆర్ఎస్ పార్టీ పేర్కొంది.

KCR
TRS
Telangana
Political
Central government
BJP
Parliament

More Telugu News