Droupadi Murmu: భారతీయ దుష్ట భావజాలానికి ముర్ము ప్రతినిధి అన్న కాంగ్రెస్ నేత... భగ్గుమన్న బీజేపీ

  • ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నిక
  • ద్రౌపది ముర్ము వర్సెస్ యశ్వంత్ సిన్హా
  • ఎన్డీయే తరఫున బరిలో నిలిచిన ముర్ము
  • ముర్ముపై కాంగ్రెస్ నేత అజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు
  • క్షమాపణలు చెప్పాల్సిందేనన్న బీజేపీ
BJP fires on Congress leader Ajoy Kumar who called Murmu represents very evil philosophy of India

మరో నాలుగు రోజుల్లో దేశంలో రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో మిగిలారు. కాగా, భారతీయ దుష్ట భావజాలానికి ముర్ము ప్రతినిధి అంటూ కాంగ్రెస్ నేత అజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ వర్గాలు భగ్గుమన్నాయి. యావత్ గిరిజన సమాజానికి కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజద్ పూనావాలా డిమాండ్ చేశారు. 

ద్రౌపది ముర్ము అట్టడుగు స్థాయి నుంచి ఎదిగారని, అజయ్ కుమార్ తన వ్యాఖ్యల ద్వారా ఆమెను అవమానించారని తెలిపారు. 'పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచి, ఏమీ లేని స్థితి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ చేయడం దుష్ట భావజాలం అవుతుందా? ఉత్తమ ఎమ్మెల్యేగా అవార్డు పొందడం కూడా దుష్ట భావజాలం కిందికే వస్తుందా? ఆమెపై ఒక్క అవినీతి మరక కూడా లేదు. ఇందులో ఏం దుష్ట భావజాలం ఉంది?' అంటూ షెహజాద్ పూనావాలా ప్రశ్నించారు. 

"ఆమె దుష్టత్వానికి ప్రతీక అని, ఆమె ఆదివాసీ సమాజానికి ప్రతినిధి కాదని కాంగ్రెస్ నేత అజయ్ కుమార్ వ్యాఖ్యానించడం ద్రౌపది ముర్ముకే కాదు, యావత్ ఆదివాసీ సమాజానికే అవమానకరం. కాంగ్రెస్ పార్టీ దీనికి వివరణ ఇవ్వాల్సిందే, ముర్ముకు మాత్రమే కాదు మొత్తం ఆదివాసీ సమాజానికి క్షమాపణలు చెప్పాల్సిందే" అని స్పష్టం చేశారు.

More Telugu News