రూ. 4,390 కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడిన స్మార్ట్ ఫోన్ తయారీదారు ఒప్పో!
- చైనా సంస్థలపై కేంద్రం కఠిన వైఖరి
- నిబంధనల కొరడా ఝుళిపిస్తున్న కేంద్రం
- ఒప్పోపై డీఆర్ఐ దర్యాప్తు
- భారీగా కస్టమ్స్ సుంకం ఎగవేసినట్టు గుర్తింపు
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) దర్యాప్తులో ఒప్పో ఆర్థిక తప్పిదాలకు పాల్పడిన విషయం వెల్లడైంది. ఒప్పో రూ.4,390 కోట్ల మేర కస్టమ్స్ సుంకం ఎగవేతకు పాల్పడినట్టు డీఆర్ఐ తేల్చింది. మొబైల్ ఫోన్ తయారీలో ఉపయోగించే వస్తువుల కస్టమ్స్ సుంకం మినహాయింపులను ఈ సంస్థ తప్పుడు మార్గాల్లో వినియోగించుకున్నట్టు గుర్తించింది.
జాతీయ చట్టాల ప్రకారం... దిగుమతి చేసుకున్న వస్తువుల లావాదేవీల విలువకు జోడించని రాయల్టీ చెల్లింపులకు కూడా ఒప్పో పాల్పడిందని డీఆర్ఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో, సదరు లావాదేవీలకు సంబంధించి కస్టమ్స్ సుంకం చెల్లించాలంటూ కేంద్రం ఒప్పో సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఒప్పోపై డీఆర్ఐ జరిమానాలను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.