Team India: జడేజా దూకుడు... 8 వికెట్లకు 170 పరుగులు చేసిన టీమిండియా

  • టీమిండియా, ఇంగ్లండ్ మధ్య రెండో టీ20
  • బర్మింగ్ హామ్ లో మ్యాచ్
  • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా
  • రాణించిన ఓపెనర్లు.. గ్లీసన్ అద్భుత స్పెల్
  • మరోసారి విఫలమైన కోహ్లీ
Team India posts fighting total after Jadeja valuable innings

ఇంగ్లండ్ తో రెండో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. ఓ దశలో టీమిండియా 122 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దూకుడుగా ఆడడంతో భారీ స్కోరు సాధ్యమైంది. జడేజా 29 బంతుల్లో 5 ఫోర్లతో 46 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

అంతకుముందు, టాస్ ఓడిన టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 31 పరుగులు చేయగా, ఓపెనర్ గా వచ్చిన రిషబ్ పంత్ 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 26 పరుగులు చేశాడు. అయితే, ఇంగ్లండ్ జట్టులో కొత్త బౌలర్ రిచర్డ్ గ్లీసన్ అద్భుత బౌలింగ్ తో కేవలం 15 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. తొలుత రోహిత్ శర్మను అవుట్ చేసిన గ్లీసన్... తన మరుసటి ఓవర్లో వరుస బంతుల్లో కోహ్లీ, పంత్ లను అవుట్ చేసి టీమిండియాను దెబ్బకొట్టాడు. 

కాగా, కోహ్లీ వైఫల్యాల పరంపర ఈ మ్యాచ్ లోనూ కొనసాగింది. 3 బంతులాడిన కోహ్లీ కేవలం 1 పరుగు చేసి పెవిలియన్ చేరాడు. సూర్యకుమార్ యాదవ్ 15, హార్దిక్ పాండ్యా 12, దినేశ్ కార్తీక్ 12, హర్షల్ పటేల్ 13 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 4, గ్లీసన్ 3 వికెట్లు తీశారు.

More Telugu News