Jana Vani: శాలువాలు, బొకేలతో సత్కారాలు చేసేందుకు రావొద్దు... సమస్యలతో రండి: జనసేన విజ్ఞప్తి

  • రేపటి నుంచి జన వాణి-జనసేన భరోసా
  • విజయవాడలో కార్యక్రమం
  • హాజరుకానున్న పవన్ కల్యాణ్
  • స్వయంగా సమస్యలు తెలుసుకోనున్న జనసేనాని
No flower bouquets and shawls on Janasena party Jana Vani program

ప్రజల నుంచి సమస్యలు తెలుసుకునేందుకు జనసేన పార్టీ జన వాణి కార్యక్రమానికి రూపకల్పన చేసింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా ప్రజల నుంచి సమస్యల తాలూకు విజ్ఞాపన పత్రాలు స్వీకరిస్తారు. జులై 3న విజయవాడలో జన వాణి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ రానున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమానికి వచ్చేవారు శాలువాలు, బొకేలతో రావొద్దని స్పష్టం చేసింది. 

దయచేసి ఈ వేదికపై శాలువాలతో సత్కరించడం, బొకేలు ఇచ్చేందుకు సమయం వృథా చేయవద్దని సూచించింది. కేవలం సమస్యలతోనే రావాలని ఓ ప్రకటనలో పేర్కొంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజలకు భరోసా నింపేందుకు జన వాణి-జనసేన భరోసా కార్యక్రమం ఏర్పాటు చేశారని ఆ ప్రకటనలో వెల్లడించింది. 

ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రజా సమస్యల వేదికగా మలచాలని పవన్ కల్యాణ్ కోరుకుంటున్నారని జనసేన పార్టీ వివరించింది. ప్రతి ఒక్కరూ ఈ నియమాన్ని పాటించాలని విజ్ఞప్తి చేసింది.

More Telugu News