Amitabh Bachchan: రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద తళుక్కుమన్న అమితాబ్ బచ్చన్

  • సినిమా షూటింగ్ కోసం వచ్చిన బాలీవుడ్ లెజెండ్
  • కొంత కాలంగా హైదరాబాద్ లో ప్రాజెక్టు కే షూటింగ్
  • రైలు సన్నివేశంలో కనిపించిన అమితాబ్
Amitabh Bachchan spotted at Raidurg metro station

బాలీవుడ్ లెజెండరీ అమితాబ్ బచ్చన్ ఉన్నట్టుండి సాధారణ ప్రయాణికుడి మాదిరే మెట్రో స్టేషన్ వద్ద కనిపిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే జరిగింది. హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద మంగళవారం సాయంత్రం అమితాబ్ బచ్చన్ దర్శనమిచ్చారు. పక్కనే సినిమా చిత్రీకరణ బృందం కూడా ఉంది. ఇది చూసిన మెట్రో ప్రయాణికులు తమ ఫోన్లలో దృశ్యాలను బంధించారు. 

అమితాబ్ బచ్చన్ 'ప్రాజెక్టు కె' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొంత కాలంగా హైదరాబాద్ పరిసరాల్లోనే జరుగుతోంది. ఇందులో ప్రభాస్, దీపికా పదుకొణె ప్రధాన నటీనటులు. ఓ మెట్రో యూజర్ రెడిట్ నెట్ వర్క్ లో అమితాబ్ షూటింగ్ గురించి పోస్ట్ పెట్టాడు.

‘‘నాకు తెలిసి అమితాబ్ షూటింగ్ కోసం వచ్చి ఉండొచ్చు. ఓ బ్లూ లైన్ ట్రెయిన్ లోకి ఎవరినీ అనుమతించలేదు. నేను అమీర్ పేట స్టేషన్లో సాయంత్రం 6 గంటలకు వేచి ఉన్నాను. మెట్రో ఒక డమ్మీ రైలును రద్దీ వేళల్లో ఎందుకు నడిపిస్తోందో నాకు అప్పుడు అర్థం కాలేదు. రైలులో అమితాబ్ కనిపించలేదు కానీ, మెడలో ఐడీ కార్డులు వేసుకున్న కెమెరామ్యాన్ లు కనిపించారు’’ అని పేర్కొన్నాడు. 

More Telugu News