antacids: గ్యాస్ ట్యాబ్లెట్లను అదే పనిగా మింగుతున్నారా..?.. అత్యంత ప్రమాదకరమంటున్న వైద్యులు

  • పీపీఐలతో 21 శాతం అధిక హార్ట్ ఎటాక్ రిస్క్
  • వైద్యులు సూచించిన కాలానికే వాడుకోవాలి
  • ఔషధ దుకాణం నుంచి తెచ్చుకుని ఇష్టారీతిన వాడుకోవద్దు
  • జీవనశైలి, ఆహారం కారణంగానే జీఈఆర్డీ సమస్య
Increased usage of antacids among GERD patients silent cause of CVDs

మన సమాజంలో ఔషధాల వినియోగంపై.. వాటి మంచి చెడులపై అవగాహన చాలా తక్కువ. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్లామని అనుకోండి. ఆయన రాసిన ఔషధాలతో నయం అయితే మరోసారి అదే సమస్యకు డాక్టర్ దగ్గరకు వెళ్లం. అవే మందులు తెచ్చుకుని వాడుతుంటాం. 

కానీ, ఈ ధోరణే సైలంట్ కిల్లర్ గా మారుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ). కడుపులో మంట, నొప్పి, అజీర్ణం, తేన్పులు ఇవన్నీ జీఈఆర్డీలో భాగమే. మన భారతీయ సమాజంలో ఇప్పుడు 30 శాతానికి పైగా ఈ సమస్యతో బాధపడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మారిన జీవనశైలే ఈ సమస్యకు మూలం. 

గుండె చేతులు ఎత్తేస్తుంది..
గ్యాస్ట్రిక్ సమస్యల నివారణ కోసం తీసుకునే మందులనే ప్రొటాన్ పంప్ ఇన్హిబిటర్స్ (పీపీఐ) అంటారు. రాబిప్రజోల్, ఇసమప్రజోల్, ఒమెప్రజోల్, లాన్సప్రజోల్, పాంటాప్రజోల్ ఇవన్నీ ప్రొటాన్ పంప్ ఇన్హిబిటర్ ఔషధాలు. వీటినే యాంటాసిడ్స్ అని కూడా పిలుస్తుంటారు. వీటిని అతిగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు (సీవీడీ) వస్తున్నట్టు పలు అధ్యయనాలలో వెల్లడవగా, గుండె వైద్య నిపుణులు కూడా వీటిపై హెచ్చరిస్తున్నారు. 

కడుపులో అరగకపోయినా, మంట అనిపించినా, నొప్పి అనిపించినా, తేన్పులు వచ్చినా మిఠాయిల మాదిరే పీపీఐలను కొనుగోలు చేసి వేసుకునే వారు బోలెడు మంది ఉన్నారు. కానీ, వీటిని వైద్యుల సూచన లేకుండా వాడుకోవడం ప్రమాదకరం. వీటిని వినియోగించడం వల్ల 16-21 శాతం గుండె పోటు (హార్ట్ ఎటాక్) రిస్క్ ఎక్కువగా ఉంటుందని ఓ అధ్యయనం గుర్తించింది.

‘‘పీపీఐలను రోజువారీగా తీసుకోవడం వల్ల.. ఉదాహరణకు పాంటాప్రజోల్ కు, కరోనరీ హార్ట్ డిసీజ్ కు మధ్య సంబంధం ఉంది. గుండెలో సమస్య కారణంగా వచ్చే ఛాతీనొప్పిని అసిడిటీగా పొరబడే అవకాశం ఉంది. యాంటాసిడ్స్ తీసుకుంటున్నా, దీర్ఘకాలం పాటు గుండె మంట ఉంటుంటే ఒక్కసారి తప్పకుండా గుండె చెకప్ చేయించుకోవాలి. ముఖ్యంగా గుండె సంబంధిత రిస్క్ అంశాలు కనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదు’’ అని ఫోర్టిస్ హాస్పిటల్ కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ అండ్ వ్యాస్కులర్ సర్జరీ స్పెషలిస్ట్ డాక్టర్ మనీష్ హిందుజా తెలిపారు. 
 
‘‘యాంటాసిడ్స్, పీపీఐల వినియోగం పెరిగితే అది గుండె ఆరోగ్యంపై పలు విధాలుగా ప్రభావం చూపిస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ బయో అవైలబులిటీని తగ్గిస్తుంది. ఎలక్ట్రోలైట్స్ లో సమతుల్యత పోతుంది. యాంటీ ప్లేట్ లెట్ ఏంజెట్లతో మమేకం అవుతాయి’’ అని అపోలో హాస్పిటల్స్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ అపూర్వ షా తెలిపారు. వైద్యుల సూచనలు లేకుండా పీపీఐల వాడకంతో వచ్చే అనర్థాలను దృష్టిలో పెట్టుకుని వాటిని ఔషధ చట్టం షెడ్యూల్ కేలో చేర్చారు. 

పెరుగుతున్న వినియోగం
యాంటాసిడ్స్ సులభంగా మందుల దుకాణాల్లో లభిస్తున్నాయని, దీంతో ప్రజలు వాటిని కొనుగోలు చేసి వాడుకోవడానికి అలవాటు పడుతున్నారని అపోలో హాస్పిటల్స్ మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ దీపక్ గుప్తా తెలిపారు. మార్కెట్లో అమ్ముడయ్యే అల్లోపతి ఔషధాల్లో 20 శాతం వాటా యాంటాసిడ్స్ దే ఉంటుందన్నారు. 

అసిడిటీ కారణాలు..
మనం తీసుకునే ఆహారమే యాంటాసిడ్స్ వినియోగం పెరగడానికి కారణమవుతున్నట్టు డాక్టర్ అగర్వాల్ చెబుతున్నారు. ‘‘అసిడిటీ రావడానికి మన జీవనశైలి ప్రధాన ప్రేరణగా ఉంటోంది. ప్రధాన కారణం ఆహారమే. సిట్రస్ జాతి పండ్లు, టమాటాలు, ఉల్లిగడ్డలు, చాక్లెట్లు, కాఫీ, చీజ్, పిప్పర్ మెంట్ అసిడిటీని కలిగిస్తాయి. మసాలా ఫుడ్స్, కడుపునిండా తినేయడం కూడా సమస్యకు కారణం’’ అని డాక్టర్ అగర్వాల్ వివరించారు. 

జీఈఆర్డీ సమస్యకు స్థూలకాయం, పొగాకు ఉత్పత్తుల వినియోగం, పొగతాగడం, మసాలాలు, మాంసాహార భోజనం, కనెక్టివ్ టిష్యూ వ్యాధి, యాంటీబయోటిక్స్, ఎన్ఎస్ఏఐడీ (నొప్పి నివారణ మందులు)లు, యాంటీ డిప్రసెంట్ మందులు, ఆస్టియో పోరోసిస్ నివారణకు తీసుకునే మందులు కూడా కారణమవుతున్నట్టు డాక్టర్ షా తెలిపారు. 

జీవనశైలితో ముప్పు..
‘‘గుండె జబ్బుల భారం వేగంగా పెరుగుతోంది. అనారోగ్యకర జీవనశైలి, శారీరకంగా కదలికలు లేకపోవడం, అనారోగ్యకర ఆహారం, పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం, వేళకు నిద్రించకపోవడం ప్రధాన కారణాలు’’ అని సింబయాసిస్ హాస్పిటల్ ఇంటర్ వెన్షనల్ కార్డియాలజిస్ట్ అంకుర్ పతెర్ పేకర్ తెలిపారు. స్నాక్స్, స్పైసీ ఫుడ్స్, డ్రింక్స్ సైతం జీఈఆర్డీకి దారితీస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. 

వైద్యుల సిఫారసు లేకుండా వద్దు
పీపీఐలను తీసుకోవడం వల్ల అందులోని ఔషధ కాంపౌండ్లు.. పొట్టలోని యాసిడ్స్ ను న్యూట్రల్ గా మారుస్తాయి. దాంతో మంట, అరగకపోవడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలం పాటు వాడితే మాత్రం తీవ్ర దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రోజువారీగా దీర్ఘకాలం పాటు తీసుకుంటే మెగ్నీషియం, బీ12 లోపాలకు, కిడ్నీ సమస్యలకు దారితీస్తాయి. ఇతర ఔషధాల పనితీరును కూడా ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబతుున్నారు.

‘‘చాలా యాంటాసిడ్స్ లో క్యాల్షియం ఉంటుంది. వైద్యులు సూచించిన కాలానికి మించి వీటిని తీసుకుంటే అధిక క్యాల్షియం కారణంగా తల తిరగడం, ప్రవర్తనా సమస్యలు, వాంతులు, కిడ్నీల్లో రాళ్లు, ఆల్కలోసిస్ కు దారితీస్తాయి’’ అని డాక్టర్ అగర్వాల్ తెలిపారు. యాంటాసిడ్స్ ఉపశమనం మాత్రమే ఇస్తాయని, సమస్యను నయం చేయలేవని, వైద్యులను సంప్రదించాలని సూచించారు.

More Telugu News