BJP: ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ

  • రెండు ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు
  • రెండింటా బీజేపీ అభ్యర్థులదే విజయం
  • సమాజ్ వాదీ పార్టీకి తీవ్ర నిరాశ
  • త్రిపురలోనూ మూడు అసెంబ్లీ స్థానాలు బీజేపీవే!
BJP candidates won Uttar Pradesh bypolls

ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి ఎదురులేకుండా పోయింది. ఉప ఎన్నికల్లో రెండు ఎంపీ స్థానాలనూ కాషాయదళమే కైవసం చేసుకుంది. అజంగఢ్, రాంపూర్ లోక్ సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. ఎస్పీ నేత అజామ్ ఖాన్ కంచుకోట అనదగ్గ రాంపూర్ లో బీజేపీ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ లోధీ 42 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందడం విశేషం. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్థానం అజంగఢ్ లోనూ బీజేపీకి తిరుగులేని విజయం దక్కింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి దినేశ్ లాల్ యాదవ్ నిరాహువా 8 వేల ఓట్ల తేడాతో నెగ్గారు. 

యూపీలో రెండు ఎంపీ స్థానాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులే గెలుపొందడం పట్ల సీఎం యోగి ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేశారు. యూపీ ప్రజలు వారసత్వం, మత రాజకీయాలు, నేరస్తులను ఒప్పుకోరని వ్యాఖ్యానించారు. 

అటు, త్రిపురలో 4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, మూడు స్థానాల్లో బీజేపీనే గెలుపొందింది. పంజాబ్ లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సంగ్రూర్ పార్లమెంటు స్థానంలో శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి సిమ్రన్ జిత్ మాన్ విజేతగా నిలిచారు. ఇక, ఢిల్లీ రాజిందర్ నగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి దుర్గేశ్ పాఠక్ విజయం అందుకున్నారు.

More Telugu News