Ruchira Kamboj: ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్

  • 1987 బ్యాచ్ ఐఎఫ్ఎస్ టాపర్ అయిన రుచిరా కాంబోజ్
  • 1989లో పారిస్ నుంచి దౌత్య ప్రయాణం ప్రారంభం
  • ప్రస్తుతం భూటాన్ రాయబారిగా విధులు
  • టీఎస్ తిరుమూర్తి స్థానాన్ని భర్తీ చేయనున్న కాంబోజ్
Ruchira Kamboj to be Indias Permanent Representative to UN

సీనియర్ దౌత్యవేత్త రుచిరా కాంబోజ్ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. 1987 బ్యాచ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ (IFS) అధికారి అయిన కాంబోజ్ ప్రస్తుతం భూటాన్‌లో భారత రాయబారిగా ఉన్నారు. ఐరాసలో ప్రస్తుతం భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్న టీఎస్ తిరుమూర్తి స్థానాన్ని కాంబోజ్ భర్తీ చేయనున్నారు.

1987 ఫారెన్ సర్వీస్ టాపర్ అయిన కాంబోజ్ తన దౌత్య ప్రయాణాన్ని ఫ్రాన్స్‌లోని పారిస్ నుంచి ప్రారంభించారు. 1989-91 మధ్య ఆమె భారత ఎంబసీ మూడో కార్యదర్శిగా పనిచేశారు. పారిస్ నుంచి వచ్చాక 1991-96 మధ్య విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలోని యూరప్ వెస్ట్ విభాగంలో అండర్ సెక్రటరీగా సేవలందించారు. 

1996 నుంచి 1999 వరకు మారిషస్‌లోని పోర్ట్ లూయిస్‌లో భారత హైకమిషన్‌లో మొదటి కార్యదర్శి (ఆర్థిక, వాణిజ్య)గా, చాన్సరీ హెడ్‌గా పనిచేశారు. ఆ తర్వాత జులై 2017 నుంచి మార్చి 2019 వరకు లెసోతో దేశానికి, ఏకకాలిక గుర్తింపుతో దక్షిణాఫ్రికాకు భారత హైకమిషనర్‌గా పనిచేశారు. 17 మే 2019న భూటాన్‌లో భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరించారు. అంతేకాదు, న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితికి 2002-2005 వరకు భారత శాశ్వత మిషన్‌లో కౌన్సెలర్‌గానూ కాంబోజ్ సేవలందించారు.

  • Loading...

More Telugu News