Team India: దంచి కొట్టిన భార‌త బ్యాట‌ర్లు.. ద‌క్షిణాఫ్రికా ల‌క్ష్యం 212 పరుగులు

  • మెరిసిన ఇషాన్ కిష‌న్‌
  • 76 ప‌రుగుల‌తో రాణించిన ఓపెన‌ర్‌
  • 20 ఓవ‌ర్ల‌లో 211 ప‌రుగులు చేసిన టీమిండియా
south africa target is 212 runs in first t20 match with india

ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జ‌రుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా బ్యాట‌ర్లు దంచి కొట్టారు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏకంగా 211 ప‌రుగులు పిండుకున్నారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోసిన భార‌త ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్ ఏకంగా 76 ప‌రుగులు రాబ‌ట్టాడు. ఇషాన్‌తో క‌లిసి భార‌త ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రుతురాజ్ గైక్వాడ్ 23 ప‌రుగుల‌తో ఫ‌ర‌వాలేద‌నిపించాడు. 

గైక్వాడ్ అవుట్‌తో క్రీజులోకి వ‌చ్చిన శ్రేయాస్ అయ్య‌ర్ (36), ఆ త‌ర్వాత వ‌చ్చిన కెప్టెన్ రిష‌బ్ పంత్ (29), హార్దిక్ పాండ్యా (31) రాణించారు. చివ‌ర‌లో వ‌చ్చిన దినేశ్ కార్తీక్ (1) రెండు బంతులు మాత్ర‌మే ఆడి అజేయంగా నిలిచాడు. వెర‌సి దినేశ్ మిన‌హా మిగిలిన న‌లుగురు భార‌త బ్యాట‌ర్లు డ‌బుల్ డిజిట్ ప‌రుగుల‌తో ప్రోటీస్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపారు. 

ఇక ద‌క్షిణాఫ్రికా బౌలర్లు భారీ ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నా... వికెట్లు తీయ‌డంలో కూడా రాణించ‌లేక‌పోయారు. 20 ఓవ‌ర్లో 4 వికెట్ల‌ను మాత్ర‌మే వారు తీయ‌గ‌లిగారు. ప్రోటీస్ బౌల‌ర్ల‌లో కేశ‌వ్ మ‌హారాజ్‌, డేనియ‌ల్ ప్రిటోరియ‌స్‌, ఎన్రిచ్ నోర్ట‌జే, వైనీ పార్నెల్‌ల‌కు త‌లో వికెట్ ద‌క్కింది. 212 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో ద‌క్షిణాఫ్రికా త‌న ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.

More Telugu News