Punjab: మాజీ సీఎం బియాంత్ సింగ్‌కు పట్టినగతే నీకూ పడుతుంది.. పంజాబ్ సీఎంకు ఎస్ఎఫ్‌జే బెదిరింపులు

  • సీఎంను బెదిరిస్తూ వీడియో విడుదల చేసిన సిఖ్స్ ఫర్ జస్టిస్
  • స్వర్ణ దేవాలయం నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్
  • బేఖాతరు చేస్తే తర్వాత జరిగే పరిణామాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిక
SFJ Threatens Punjab CM Bhagwant Mann

స్వర్ణ దేవాలయం నుంచి బలగాలను ఉపసంహరించుకోకుంటే మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్‌కు పట్టిన గతే నీకూ పడుతుందంటూ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్‌ను సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థ తీవ్రంగా హెచ్చరించింది. తమ హెచ్చరికలను కనుక బేఖాతరు చేస్తే తర్వాత జరిగే పరిణామాలకు సిద్ధంగా ఉండాలంటూ ఓ వీడియో విడుదల చేసింది. అందులో ఆ సంస్థ చీఫ్ గుర్‌పత్వంత్ పన్నూ మాట్లాడుతూ.. కొన్ని డిమాండ్లను పంజాబ్ సీఎం ముందు ఉంచారు. 

స్వర్ణ దేవాలయం నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని, ఖలిస్థానీ అనుకూల శక్తులకు వ్యతిరేకంగా నడుచుకోవడం ఆపేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఖలిస్థానీ రెఫరెండంపై ఓటింగ్ తేదీని సోమవారం అకల్ తఖ్త్ వద్ద ప్రకటిస్తామన్నారు. సీఎం భగవంత్‌సింగ్ మాన్ నిన్న అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. ప్రార్థనల అనంతరం అకల్ తఖ్త్ జతీందర్ నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. కాగా, 31 ఆగస్టు 1995లో అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ కారుబాంబు దాడిలో హత్యకు గురయ్యారు.

More Telugu News