Rentachintala: రెంటచింతలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం

  • శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకుని వస్తుండగా ఘటన
  • మరికాసేపట్లో ఇంటికి చేరుకుంటామనగా ఘటన
  • నిద్రమత్తు కారణంగా ఆగివున్న లారీని గుర్తించలేకపోయిన డ్రైవర్
  • మరో 15 మందికి తీవ్ర గాయాలు
Dreaded accident in Andhrapradesh Rentachintala 6 dead

పల్నాడు జిల్లా రెంటచింతలలో గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెంటచింతలకు చెందిన 38 మంది టాటా ఏస్ వాహనంలో శ్రీశైలం వెళ్లి మల్లికార్జునస్వామిని దర్శించుకుని తిరిగి పయనమయ్యారు. మరికాసేపట్లో వారు ఇంటికి చేరుకుంటారనగా ప్రమాదం సంభవించింది. రెంటచింతల విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం ఆగివున్న లారీని బలంగా ఢీకొట్టింది.

దీంతో వాహనంలో ఉన్న వారు ఎగిరి రోడ్డు మీద పడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డు మొత్తం రక్తసిక్తమైంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News