Amit Shah: సొంతగడ్డపై పులుల్లా రెచ్చిపోయిన గుజరాత్ బౌలర్లు... ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు హాజరైన అమిత్ షా

  • అహ్మదాబాద్ లో ఐపీఎల్ ఫైనల్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
  • 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 రన్స్
  • 39 పరుగులు చేసిన బట్లర్
  • 3 వికెట్లు తీసిన హార్దిక్ పాండ్యా
Amit Shah attends IPL final match at Narendra Modi stadium in Ahmedabad

ఐపీఎల్ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ కు ఏదీ కలిసిరాలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ జట్టును గుజరాత్ టైటాన్స్ బౌలర్లు సమర్థంగా కట్టడి చేశారు. ఏ దశలోనూ భారీ స్కోరు సాధించేలా కనిపించని రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 130 పరుగులతో సరిపెట్టుకుంది. ఫామ్ లో ఉన్న జోస్ బట్లర్ 39 పరుగులు చేయగా, మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 22 పరుగులు చేశాడు. ఆ జట్టులో వీరిద్దరూ తప్ప మరెవ్వరూ రాణించలేదు. 

కెప్టెన్ సంజూ శాంసన్ 14, దేవదత్ పడిక్కల్ 2, హెట్మెయర్ 11, అశ్విన్ 6, రియాన్ పరాగ్ 15, బౌల్ట్ 11, మెక్ కాయ్ 8 పరుగులు చేశారు. బట్లర్ క్రీజులో ఉన్నంతసేపు ధీమాగా కనిపించిన రాజస్థాన్ రాయల్స్... అతడు అవుట్ కాగానే ఢీలాపడిపోయింది. బట్లర్ వికెట్ ను గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పడగొట్టడం విశేషం. గుజరాత్ బౌలర్లలో పాండ్యాకు 3 వికెట్లు, సాయి కిశోర్ కు 2, షమీకి 1, యశ్ దయాళ్ కు 1, రషీద్ ఖాన్ కు 1 వికెట్ దక్కాయి. 

కాగా, అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తన అర్ధాంగి సోనాల్ షాతో కలిసి హాజరయ్యారు. సతీసమేతంగా మ్యాచ్ ను ఆసక్తిగా తిలకిస్తూ కెమెరా కంటికి చిక్కారు.
.

More Telugu News