Rajendra Bahuguna: మనవరాలిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఆత్మహత్య

  • ఉత్తరాఖండ్ లో ఘటన
  • 2004లో మంత్రిగా పనిచేసిన రాజేంద్ర బహుగుణ
  • మూడ్రోజుల కిందట తీవ్ర ఆరోపణలు చేసిన కోడలు
  • తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు
  • మాజీ మంత్రిపై పోక్సో చట్టం కింద కేసు
Former minister Rajendra Bahuguna shot himself

ఉత్తరాఖండ్ మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఓ తాగునీటి ట్యాంకు పైకి ఎక్కిన ఆయన తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు విడిచారు. రాజేంద్ర బహుగుణ 2004లో ఎన్డీ తివారీ సర్కారులో మంత్రిగా వ్యవహరించారు. కాగా, మూడ్రోజుల కిందట రాజేంద్ర బహుగుణపై ఆయన కోడలు తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమార్తెపై బహుగుణ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

బహుగుణ కోడలు... భర్తతో విభేదాల కారణంగా విడిగా ఉంటున్నారు. బహుగుణ నివాసంలోనే మరో ఫ్లోర్ లో ఆమె తన కుమార్తెతో ఉంటున్నారు. అయితే, తనపై కోడలు తీవ్ర ఆరోపణలు చేయడం, మనవరాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ బయట ప్రచారం జరగడంతో మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. 

ఎమర్జెన్సీ నెంబరు 112కి కాల్ చేసిన అనంతరం, హల్ద్వానీలోని భగత్ సింగ్ కాలనీలో ఓ వాటర్ ట్యాంకు ఎక్కారు. కిందికి దిగి రావాలని పోలీసులు నచ్చచెప్పినా, ఆయన హఠాత్తుగా దేశవాళీ తుపాకీ తీసి తనను తాను కాల్చుకున్నారు. ఆయనను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

More Telugu News