Balakrishna: హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణను అడ్డుకున్న పోలీసులు!

  • హిందూపురం నియోజకవర్గం కొడికొండలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ
  • గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన బాలకృష్ణ
  • టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే తిరగబడతామని హెచ్చరిక
Police stopped Balakrishna vehicle

టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణను పోలీసులు అడ్డుకున్న ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రస్తుతం బాలయ్య హిందూపురం నియోజకవర్గం పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో చిలమత్తూరు మండల కొడికొండ వద్ద బాలయ్య వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మూడు రోజుల క్రితం కొడికొండలో జాతర జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో, గాయపడ్డ టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు బాలకృష్ణ వచ్చారు. 

అయితే, బాలయ్య కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, అక్కడి పరిస్థితి వేడెక్కింది. చివరకు మొత్తం కాన్వాయ్ ని కాదని, కేవలం బాలకృష్ణ వాహనాన్ని మాత్రమే పోలీసులు గ్రామంలోకి అనుమతించారు. బాలకృష్ణ రాకతో భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు తరలి వచ్చారు. 

ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ వైసీపీ నేతలు గ్రామాల్లో కక్షలు రేపే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలపై దాడిని ఖండిస్తున్నానని చెప్పారు. మరొకసారి కార్యకర్తల జోలికి వస్తే తిరగబడతామని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని... అంతా బాదుడే బాదుడని దుయ్యబట్టారు. మట్టి దగ్గర నుంచి ప్రతి దాంట్లో దోపిడీ పర్వమే కొనసాగుతోందని మండిపడ్డారు. 

More Telugu News