TDP Mahanadu: ఒంగోలులో మహానాడుకు ఏర్పాట్లు పూర్తి... ఎవరూ ఆపలేరన్న అచ్చెన్నాయుడు

  • ఈ నెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు
  • పసుపుమయంగా ఒంగోలు పట్టణం
  • ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అచ్చెన్నాయుడు
  • ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని ఆరోపణ
  • సమష్టి కృషితో ఏర్పాట్లు చేసుకున్నామని వెల్లడి
All set for TDP Mahanadu in Ongole

టీడీపీ మహానాడుకు ప్రకాశం జిల్లా ముఖ్యపట్టణం ఒంగోలు వేదికగా నిలుస్తోంది. ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో మహానాడు నిర్వహిస్తుండడం తెలిసిందే. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒంగోలులోనే మకాం వేసి మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని వెల్లడించారు. 

తమ మహానాడును అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్ని అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. మహానాడును విఫలం చేయాలని ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ కార్యక్రమం ఆగదని స్పష్టం చేశారు. నేతలు, కార్యకర్తల సమష్టి కృషితో మహానాడు ఏర్పాట్లు పూర్తయ్యాయని అచ్చెన్నాయుడు వివరించారు. రేపటి మహానాడుకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు.

ఈ సందర్భంగా అచ్చెన్న సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. "సీఎం జగన్ పది మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చి సామాజిక న్యాయం చేశామంటున్నారు. 2014లో టీడీపీకి 103 స్థానాలు వస్తే 9 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చింది. కానీ జగన్ 151 స్థానాలు గెలిచి 10 మందికే మంత్రి పదవులు ఇచ్చారు. ఆ లెక్కన చూస్తే ఏ పార్టీ సామాజిక న్యాయం పాటించినట్టు?" అని ప్రశ్నించారు.

More Telugu News