TDP: డయాఫ్రమ్ వాల్ కట్టడమంటే మీ ఇంట్లో మరుగు దొడ్డి కట్టడం కాదు: అంబ‌టిపై అయ్య‌న్న విసుర్లు

  • డ‌యాఫ్ర‌మ్ వాల్ దెబ్బ‌తిన‌డానికి రివ‌ర్స్ టెండ‌రింగే కార‌ణం
  • జ‌గ‌న్ స‌ర్కారు తీరు వ‌ల్ల పోల‌వ‌రంలో అన్నింటా న‌ష్ట‌మే
  • పోల‌వ‌రంలో అన్ని ప‌నులూ అథారిటీ, కేంద్ర జ‌ల సంఘం అనుమ‌తుల మేర‌కేన‌న్న అయ్య‌న్న‌
ayyannapatrudu satires on ambati rambabu

పోలవ‌రం ప్రాజెక్టులో ప్ర‌ధాన నిర్మాణంగా ఉన్న డ‌యాఫ్ర‌మ్ వాల్ వేదిక‌గా ఏపీ జ‌ల‌న‌వ‌రుల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబుపై సెటైర్లు సంధిస్తూ టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు తాజాగా వరుస ట్వీట్ల‌తో విరుచుకుప‌డ్డారు. మంత్రి అంబ‌టి రాంబాబును అజ్ఞానిగా అభివర్ణించిన అయ్య‌న్న‌... అంబ‌టి తెలుసుకోవాల్సిన అంశాలు పోల‌వ‌రంలో చాలానే ఉన్నాయంటూ దెప్పిపొడిచారు. 

ఈ సంద‌ర్భంగా పోలవ‌రం ప్రాజెక్టుపై ఏపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హరించిన తీరును అయ్య‌న్న స‌వివ‌రంగా ప్ర‌స్తావించారు. 2019 ఆగష్టులో వైసీపీ ప్రభుత్వం పోలవరం నిర్మాణం కోసం రివర్స్ టెండరింగ్ కి వెళ్లిందన్న అయ్య‌న్న‌... ఈ ప్రక్రియ ద్వారా పనులకు బ్రేక్ పడుతుందని, సమయం వృథా అవుతుందని, అంచనా వ్యయం పెరుగుతుందని... వీటన్నింటి నివార‌ణ‌కు రివర్స్ టెండరింగ్ కి వెళ్లొద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింద‌ని తెలిపారు. 

అయినా కూడా వెనక్కి తగ్గని జగన్ సర్కార్ డబుల్ స్పీడ్ తో తక్కువ రేటుకే నిర్మాణం పూర్తి చేస్తామని కేంద్రానికి నివేదిక ఇచ్చిందని అయ్య‌న్న పేర్కొన్నారు. పోలవరం హెడ్ వర్క్స్ ప‌నులు పూర్తి చెయ్యడానికి రూ.1771 కోట్లు అవసరమైతే రివర్స్ టెండరింగ్ ద్వారా ఓ కంపెనీ రూ.1548 కోట్లకే 24 నెలల్లో ప‌నులు పూర్తి చేయడానికి ముందుకొచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం డప్పు కొట్టిందని తెలిపారు. రూ.223 కోట్లు ప్రజాధనం మిగిలిపోయిందని ప్రచారం చేశార‌ని ఆయ్య‌న్న ఆరోపించారు. ఆఖరికి ఇప్పుడు వ్యయం రూ.1917 కోట్లకు పెరిగిందని... వాస్తవ అంచనా కంటే రూ.146 కోట్లు ప్రజా ధనం రివర్స్ టెండరింగ్ ద్వారా వృథా అయ్యిందని ధ్వ‌జ‌మెత్తారు.

డబుల్ స్పీడ్ తో పనులు దేవుడెరుగు, అసలు పనులు ఆగిపోవడం వలనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఆయ్య‌న్న తెలిపారు. 2019 నవంబర్ లోనే రివర్స్ టెండరింగ్ ప్రక్రియ పూర్తి చేసి సదరు కంపెనీకి అప్పజెప్పారన్న అయ్య‌న్న‌... నవంబర్ లో వరద ఉండదు కాబట్టి అప్పుడే పనులు పూర్తి చేసి ఉంటే కాఫర్ డ్యామ్ పూర్తి అయ్యేదని, ఈసిఆర్ఎఫ్ కట్టేసి ఉంటే అసలు డయాఫ్రమ్ వాల్ దెబ్బతినేదీ కాదన్నారు. 2019లో 14 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా డయాఫ్రమ్ వాల్ నిలబడిందన్న అయ్య‌న్న‌... 2020లో 23 లక్షల క్యూసెక్కుల వరద రావడంతోనే డయాఫ్రమ్ దెబ్బతిందన్నారు. 

జగన్ స‌ర్కారు అనుస‌రించిన‌ రివర్స్ టెండరింగ్ డ్రామాలతోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని అయ్య‌న్న తేల్చేశారు. పోలవరంలో ఏం కట్టాలి, ఎప్పుడు కట్టాలి అనేది పోలవరం అధారిటీ, కేంద్ర జల సంఘం అనుమతుల ప్రకారమే జరుగుతాయని ఆయ‌న పేర్కొన్నారు. డయాఫ్రమ్ వాల్ కట్టడమంటే మీ ఇంట్లో మరుగు దొడ్డి కట్టడం కాదన్న అయ్య‌న్న‌... సంజన, సుకన్యతో ఫోన్ సరసాలు ఆపి, వాస్తవాలు తెలుసుకోవాలంటూ అంబ‌టిపై సెటైర్లు సంధించారు.

More Telugu News