CM Jagan: ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్

 CM Jagan lays foundation stone for Integrated Renewable Power Project in Kurnool district
  • కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
  • ఓర్వకల్లు మండలం గుమ్మితం తండాలో భారీ పవర్ ప్రాజెక్టు
  • రూ.15 వేల కోట్లతో నిర్మిస్తున్న గ్రీన్ కో ఎనర్జీస్ సంస్థ
  • ఐదేళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందన్న సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఓర్వకల్లు మండలం గుమ్మితం తండాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ పవర్ ప్రాజెక్టు ప్రత్యేకత ఏంటంటే... ఒకే యూనిట్ లో సోలార్, విండ్, హైడల్ విద్యుత్ ఉత్పాదన చేస్తారు. భారీ మొత్తంలో ఇక్కడ ఎనర్జీ స్టోరేజి కూడా చేస్తారు. ఇటువంటి భారీ ప్రాజెక్టుతో చరిత్ర సృష్టించబోతున్నామని సీఎం జగన్ అన్నారు. 

ఈ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు కోసం గ్రీన్ కో ఎనర్జీస్ సంస్థ రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెడుతోందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో నిరంతరం పునరుత్పాదక విద్యుదుత్పత్తి జరుగుతుందని వెల్లడించారు. విద్యుత్ వినియోగం తక్కువగా ఉన్న సమయంలో కొంతమేర సోలార్, విండ్ ఎనర్జీ ద్వారా నీటిని పంపింగ్ చేస్తారని తెలిపారు. విద్యుత్ కు డిమాండ్ ఉన్న సమయంలో ఆ నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారని వివరించారు. 

గ్రీన్ పవర్ ఉత్పత్తి కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టు దేశానికి సరికొత్త మార్గం చూపుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కూడా ఇదే తరహా ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News