KA Paul: అమిత్ షాతో కేఏ పాల్ భేటీ.. కేసీఆర్, కేటీఆర్‌పై ఫిర్యాదు

  • తనపై దాడి వెనక కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని ఆరోపణ
  • రాష్ట్రాలు ఇలానే అప్పులు చేసుకుంటూ పోతే దేశం మరో శ్రీలంక అవుతుందన్న పాల్
  • తెలంగాణలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను తన జీవితంలోనే చూడలేదని విమర్శ
  • ప్రజాశాంతి పార్టీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తుందన్న పాల్
Praja Shanti Party Chief KA Paul meets Union Minister Amit Shah

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గతరాత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమిత్ షాతో పలు విషయాలపై చర్చించినట్టు చెప్పారు. ఇటీవల తనపై జరిగిన దాడి వెనక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ఉన్నారని ఆరోపించారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అప్పుల కుప్పలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ రూ. 8 లక్షల కోట్లు అప్పు చేస్తే, తెలంగాణ రూ. 4.5 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. అప్పులు ఇలాగే చేసుకుంటూ పోతే త్వరలోనే దేశం మరో శ్రీలంక అవడం ఖాయమని హెచ్చరించారు. 

ఇక తెలంగాణలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను తన జీవితంలోనే ఎన్నడూ చూడలేదన్నారు. తెలంగాణలో డీజీపీని కలిసేందుకు అపాయింట్‌మెంట్ అడిగితే ఇవ్వలేదని, కానీ అమిత్ షా అడగ్గానే ఇచ్చారని అన్నారు. ప్రధాని మోదీని కలవాలని షా సూచించారన్నారు. ప్రజాశాంతి పార్టీ భవిష్యత్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తుందన్నారు.

More Telugu News