Chandrababu: ఇలాంటి ఘటనలు రాష్ట్ర బ్రాండ్ ఇమేజిని దారుణంగా దెబ్బతీస్తాయి: చంద్రబాబు

  • కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు 
  • సీఎం కాన్వాయ్ కోసం కార్లు కూడా సమకూర్చుకోలేని స్థితిలో రాష్ట్రం వుందంటూ విమర్శలు 
  • ఇలాంటివి అవమానకరమన్న చంద్రబాబు
  • రాష్ట్రంలో వ్యవస్థల ధ్వంసానికి నిదర్శనమని వ్యాఖ్యలు 
 Chandrababu comments on CM Jagan convoy and cars issue

ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం కనీసం కార్లు కూడా సమకూర్చుకోలేని స్థితిలో రాష్ట్రం ఉండడం అవమానకరం అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు కుప్పంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సీఎం పర్యటనకు కార్లు ఇచ్చిన వారికి బిల్లులు చెల్లించకపోవడం రాష్ట్ర దుస్థితికి అద్దంపడుతోందని అన్నారు. 

సీఎం, వీఐపీ కాన్వాయ్ లకు అయిన ఖర్చు రూ.17.5 కోట్లు అని, తక్షణమే చెల్లించాలంటూ రవాణశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడంపై చంద్రబాబు పైవిధంగా స్పందించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక  పెండింగ్ బిల్లు అంశంలా మాత్రమే చూడరాదని, ఇది రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు, వ్యవస్థల ధ్వంసానికి నిదర్శనంలా చూడాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు రాష్ట్ర బ్రాండ్ ఇమేజిని ఘోరంగా దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి బాధ్యత లేదు, సీఎంకు పాలన తెలియదు అని చంద్రబాబు విమర్శించారు.

More Telugu News