Roja: లోటస్ పాండ్ లో వైఎస్ విజయమ్మను కలిసిన మంత్రి రోజా

  • ఇటీవల మంత్రిగా బాధ్యతలు అందుకున్న రోజా
  • నేడు విజయమ్మ నివాసానికి రాక
  • సాదరంగా స్వాగతించిన విజయమ్మ
  • రోజా అంటే తమ కుటుంబానికి ఎంతో ప్రేమ అని వెల్లడి
Minister Roja met YS Vijayamma in Lotus Pond

ఇటీవలే ఏపీ టూరిజం, క్రీడలు, సాంస్కృతిక, యువజన వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజా విస్తృత స్థాయిలో పర్యటనలు చేపడుతున్నారు. ఓవైపు పరిపాలనా సంబంధిత కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటూనే, మరోవైపు ప్రముఖులను కలుస్తున్నారు. తాజాగా, వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కలిశారు. రోజా నేడు హైదరాబాదులోని లోటస్ పాండ్ లో ఉన్న విజయమ్మ నివాసానికి వెళ్లారు. ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఈ సందర్భంగా పార్టీ కోసం రోజా పాటుపడుతున్న తీరు పట్ల విజయమ్మ అభినందించారు. రోజా పార్టీ కోసం, పార్టీ అధినాయకత్వంపై నమ్మకంతో ఎంతో నిబద్ధతతో కష్టపడుతుందని కొనియాడారు. ప్రతి నేతకు ఉండాల్సిన లక్షణం ఇదేనని గతంలో వైఎస్సార్ చెప్పిన మాటలను విజయమ్మ ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

అంతేకాదు, రోజా అంటే సీఎం జగన్ కు, వైఎస్ కుటుంబానికి ఎంతో ప్రేమ ఉందని తెలిపారు. భవిష్యత్తులో రోజా మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటూ విజయమ్మ ఆశీర్వదించారు.

More Telugu News