Pawan Kalyan: బురద రాజకీయాలు మాకు చేతగాదు: పవన్ కల్యాణ్

  • రైతుల ఆత్మహత్యలపై పవన్ స్పందన
  • కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు రైతుల బలవన్మరణం
  • ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేనాని
  • ప్రభుత్వం దృష్టి సారించడంలేదని విమర్శలు
Pawan Kalyan reacts farmers suicide incidents in AP

రైతుల ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాగు నష్టాలు, అప్పుల భారంతో రైతులు మానసికంగా కుంగిపోతున్నారని, కానీ వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించడంలో పాలకపక్షం విఫలమవుతోందని విమర్శించారు. కర్నూలు జిల్లాలో దేవరమణి జగదీశ్ (మేళిగనూరు), ప్రకాశం జిల్లాలో పాలగిరి రామ్మూర్తి (కాటూరివారి పాలెం) పంట నష్టాలు, రుణ భారంతో ఆత్మహత్యలకు పాల్పడడం దిగ్భ్రాంతి కలిగించిందని పవన్ కల్యాణ్ తెలిపారు. 

రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే, వ్యవసాయ రంగంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడంలేదని అర్థమవుతోందని విమర్శించారు. ఇలాంటి విషయాల్లో జనసేన పార్టీ ఎంతో బాధ్యతగా మాట్లాడుతుంటే పాలకపక్షం మాత్రం దీన్ని రాజకీయకోణంలో చూస్తోందని పవన్ పేర్కొన్నారు. రైతులకు అండగా నిలవడం జనసేన ఒక బాధ్యతగా చేపట్టిందని, తమకు బురద రాజకీయాలు చేతగాదని స్పష్టం చేశారు.

అటు, భూ రికార్డుల్లో లోపాలతో కూడా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పవన్ కల్యాణ్ వెల్లడించారు. భూ రికార్డుల్లో పొరపాటును సరిచేయాలని అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఇక్కుర్తి ఆంజనేయులు అనే రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనతో అధికారుల్లో కదలిక వచ్చినట్టు అర్థమవుతోందని తెలిపారు. 

అయితే, ఆంజనేయులు ఆత్మహత్యపై గుంటూరు జిల్లా కలెక్టర్ స్పందించి ఆదేశాలు ఇచ్చినా, క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం చూస్తుంటే దీని వెనుక ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? అనే సందేహం కలుగుతోందని పేర్కొన్నారు. 

సాగు నష్టాలు, అప్పుల బాధలు, భూ రికార్డుల లోపాలతో రైతులు ఆత్మహత్య ఆలోచన చేసే పరిస్థితి రాకుండా బాధ్యతగా ముందుకు వెళ్లాలని పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి హితవు పలికారు. ఉన్నతస్థాయి రెవెన్యూ, సర్వే అధికారులు, జిల్లా స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రైతాంగంలో మనోస్థైర్యం నింపే దిశగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News