Kondapalli Durgadevi: తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన కొండపల్లి దుర్గాదేవి కన్నుమూత

  • తండ్రి, భర్త ప్రభావంతో వామపక్ష ఉద్యమాలవైపు ఆకర్షితురాలైన దుర్గాదేవి
  • 1974లో ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక
  • నేటి మధ్యాహ్నం ఖమ్మంలో అంత్యక్రియలు

తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన కొండపల్లి దుర్గాదేవి కన్నుమూశారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. అఖిల భారత మహిళా సంఘం (ఐద్వా) సీనియర్ నాయకురాలు కూడా అయిన దుర్గాదేవి.. తండ్రి వీర రాఘవరావు, భర్త, మాజీ ఎమ్మెల్యే కేఎల్ నరసింహారావు ప్రభావంతో వామపక్ష ఉద్యమాలవైపు మొగ్గారు. ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. 

1974లో జరిగిన తొలి మహాసభలో దుర్గాదేవి ఐద్వా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె భర్త నరసింహారావు ఇల్లందు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దుర్గాదేవి భౌతిక కాయాన్ని ఈ ఉదయం 9-10 గంటల వరకు హైదరాబాదు, బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం ఖమ్మంలో మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తారు. దుర్గాదేవి మృతికి ఐద్వా జాతీయ నేత బృందా కారత్ సహా పలువురు సంతాపం తెలిపారు.

More Telugu News