VH: మహిళా క్రికెటర్ ఇంటిని కూల్చేసిన జీహెచ్ఎంసీ... ధర్నా చేపట్టిన వీహెచ్

  • సికింద్రాబాద్ లో నివసిస్తున్న భోగి శ్రావణి
  • ఇల్లు శిథిలావస్థకు చేరిందంటున్న అధికారులు
  • అందుకే కూల్చివేశామని వివరణ
  • టీఆర్ఎస్ నేతల హస్తం ఉందంటున్న శ్రావణి
  • మహిళా క్రికెటర్ కు మద్దతు పలికిన వీహెచ్
Congress leader V Hanumantharao supports woman cricketer Bhogi Shravani

ఇటీవల సికింద్రాబాద్ పరిధిలో మహిళా క్రికెటర్ భోగి శ్రావణి ఇంటిని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. తల్లి మరణానంతరం శ్రావణి తన తండ్రితో కలిసి ఆ ఇంట్లో నివసిస్తోంది. అయితే, ఆ ఇల్లు శిథిలావస్థకే చేరిందని, కూలిపోయే ప్రమాదం ఉన్నందునే కూల్చివేశామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతుండగా, డిప్యూటీ స్పీకర్ పద్మారావు తనయుడు రామేశ్వర్ గౌడ్ దీనికి కారకుడని మహిళా క్రికెటర్ శ్రావణి ఆరోపిస్తోంది. 

ఈ నేపథ్యంలో, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు మహిళా క్రికెటర్ కు మద్దతు పలికారు. ఇవాళ తుకారాంగేట్ లోని శ్రావణి ఇంటి ముందు ధర్నా చేపట్టారు. ఓ దళిత క్రికెటర్ కు అన్యాయం చేస్తారా? అంటూ వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, క్రీడాకారిణికి న్యాయం చేయాలని స్పష్టం చేశారు. 

తెలంగాణలో ఇతర క్రీడాకారులకు సీఎం సాయం చేస్తున్నారు... శ్రావణి దళిత వర్గానికి చెందనది కావడంతో పట్టించుకోవట్లేదా? అని ప్రశ్నించారు. ఎక్కడ కూల్చివేశారో, అక్కడే శ్రావణికి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని వీహెచ్ డిమాండ్ చేశారు. క్రికెట్ పరంగానూ ఆమె రాణించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 

25 ఏళ్ల శ్రావణి ఆఫ్ బ్రేక్ బౌలర్ గా గుర్తింపు పొందింది. మహిళల దేశవాళీ క్రికెట్లో ఆమె హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. గతేడాది గుజరాత్ తో మ్యాచ్ లో 10 ఓవర్లలో 21 పరుగులిచ్చి 4 వికెట్లు సాధించింది. ఈ స్పెల్ లో ఆమె 2 మెయిడెన్లు విసరడం విశేషం.

More Telugu News