Mahesh Kumar Gowd: కేటీఆర్ అండతోనే డ్రగ్స్ మాఫియా చెలరేగుతోంది: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్

  • పుడింగ్ మింక్ పబ్ పై పోలీసుల దాడులు
  • పట్టుబడిన పలువురు ప్రముఖులు
  • కేటీఆర్ పై ధ్వజమెత్తిన మహేశ్ కుమార్ గౌడ్
  • పబ్ లకు కేటీఆర్ అండ ఉందని వెల్లడి
Mahesh Kumar Gowd fires on KTR

హైదరాబాదులో మరోసారి తీవ్రస్థాయిలో డ్రగ్స్ కలకలం రేగింది. గతరాత్రి బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్లో పుడింగ్ మింక్ పబ్ పై పోలీసులు దాడి చేయడం తెలిసిందే. ఈ పబ్ లో డ్రగ్స్ లభ్యం కావడంతో పాటు, పలువురు ప్రముఖులు కూడా పట్టుబడగా, పోలీసులు వారికి నోటీసులు ఇచ్చి పంపారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

కేటీఆర్ అండదండలతోనే డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోందని, హైదరాబాదులోని పబ్బులకు కేటీఆర్ మద్దతు ఉందని ఆరోపించారు. ఎవరి అండ లేకపోతే పబ్ లను అర్ధరాత్రి దాటిన తర్వాత 3 గంటల వరకు ఎలా తెరిచి ఉంచుతున్నారని మహేశ్ కుమార్ ప్రశ్నించారు. 

తాజాగా పబ్ వ్యవహారంపై ఏసీపీకి మెమో ఇవ్వడం, సీఐని సస్పెండ్ చేయడం సరికాదని విమర్శించారు. గతంలో డ్రగ్స్ కేసు ఏమైందని కాంగ్రెస్ నేత నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్సీబీ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి, డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నవారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. 

కేటీఆర్ తరచుగా గోవా వెళ్లడం వెనుక అంతర్యం ఏమిటి? డ్రగ్స్ అలవాటు లేకపోతే కేటీఆర్ శాంపిల్ ఇవొచ్చుకదా! అని నిలదీశారు. కేటీఆర్ డ్రగ్స్ వాడతాడన్న దానిపై ప్రజల్లో అనుమానాలున్నాయని వెల్లడించారు.

More Telugu News