నా ఇల్లు అక్రమంగా కట్టిందే.. బుల్డోజర్ తో కూల్చేయండి.. యోగి సర్కారును కోరిన పౌరుడు
- రాంపూర్ జిల్లాలో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు
- తన ఇల్లు కూడా అందులో భాగమని గుర్తించిన ఓ వ్యక్తి
- కూల్చేయాలని కోరుతూ కలెక్టర్ కు దరఖాస్తు
రాంపూర్ జిల్లా మిత్రాపూర్ ఎహ్రోలా గ్రామంలో ఎండిపోయిన చెరువు, సమాధుల భూములను (ప్రభుత్వానికి చెందినవి) ఆక్రమించి కొందరు ఇళ్లు నిర్మించుకున్నారు. అందులో ఎహ్సాన్ మియాన్ (40) కట్టుకున్న ఇల్లు కూడా ఉంది. దీన్ని మియాన్ తెలుసుకున్నాడు. ప్రభుత్వం ఎలానూ కూల్చేస్తుందన్న భయంతో అతడే స్వయంగా జిల్లా కలెక్టర్ అకోశ్ చౌదరి వద్దకు వెళ్లి తన అక్రమ ఇంటి నిర్మాణాన్ని కూల్చేయాలని దరఖాస్తు ఇచ్చాడు.
‘‘ఆ ఇంటిలో రెండు తరాలుగా మా కుటుంబం నివసిస్తోంది. వక్ఫ్, ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించినట్టు ఇటీవలే నా ప్లాట్ మ్యాప్ చూసి గుర్తించాను. దాంతో కూల్చేందుకు దరఖాస్తు పెట్టుకుంటున్నాను’’అని మియన్ పేర్కొన్నాడు. తమ దర్యాప్తులో మియాన్ వాదన నిజమేనని తేలినట్టు కలెక్టర్ చౌదరి కూడా వెల్లడించారు.