Karauli: కొత్త సంవత్సరాదిన రాజస్థాన్ లోని కరౌలిలో మత ఘర్షణలు.. కర్ఫ్యూ విధింపు

  • ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
  • బైక్ ర్యాలీ చేస్తున్న హిందూ యువకులపై రాళ్ల దాడి
  • షాపులు, వాహనాల దహనం
  • రంగంలోకి పెద్ద ఎత్తున పోలీసులు
Curfew clamped internet shut down in Rajasthans Karauli

హిందూ నూతన సంవత్సరం మొదటి రోజే రాజస్థాన్ లోని కరౌలిలో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని హిందూ యువకులు బైక్ ర్యాలీ తలపెట్టారు. పట్టణంలో ముస్లిం జనాభా అధికంగా ఉండే ప్రాంతం గుండా వెళుతున్న సమయంలో వాళ్లపై కొందరు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా ఘర్షణ చోటు చేసుకుంది. ఆగ్రహించిన యువకులు షాపులు, బైకులకు నిప్పంటించారు.

ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. 50 మంది ఆఫీసర్లు సహా 600 మంది పోలీసు సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.  జైపూర్ కు 170 కిలోమీటర్ల దూరంలో కరౌలి ఉంటుంది.

దాడిలో 42 మంది గాయపడినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో చాలా మందికి స్వల్ప గాయాలు కాగా, ప్రాథమిక చికిత్స తర్వాత ఇంటికి పంపించేశారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్పారు. నిందితులను త్వరగా పట్టుకుని, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం గెహ్లాట్ ఆదేశించారు. ‘‘కొందరు చొరబాటుదారులు అక్కడికి ప్రవేశించారు. వారు ఏ మతం, ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే వీటిని నివారించాలి. ఎందుకంటే వారికేమీ నష్టం కలగదు. సామాన్యులకే నష్టం’’అని గెహ్లాట్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ సర్కారు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడడం వల్లే ఈ పరిస్థితి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా ఆరోపించారు.

More Telugu News