Rimi Sen: స్నేహితుడని నమ్మితే దారుణంగా మోసం చేశాడు: హీరోయిన్ రిమీ సేన్

  • మూడేళ్ల క్రితం ఓ వ్యాపారవేత్తతో రిమీకి పరిచయం
  • అతని మాటలు నమ్మి రూ. 4.14 కోట్లు పెట్టుబడిగా ఇచ్చిన వైనం
  • ఆ తర్వాత కనిపించకుండా పోయిన స్నేహితుడు
Actress Rimi Sen cheated by her friend

బాలీవుడ్ భామ రిమీ సేన్ తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. 'అందరివాడు' చిత్రంలో చిరంజీవి సరసన రిమీ సేన్ నటించింది. హిందీలో 'ధూమ్ 2', 'బాగ్ బన్', 'గోల్ మాల్' వంటి పలు హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది. అయితే ప్రస్తుతం ఆమె చాలా బాధలో ఉంది. స్నేహితుడని నమ్మిన వ్యక్తి తనను నట్టేట ముంచాడని ఆవేదన వ్యక్తం చేసోంది. 

రిమీ సేన్ చెప్పిన వివరాల ప్రకారం... మూడేళ్ల క్రితం ఆమెకు రౌనక్ జతిన్ వ్యాస్ అనే వ్యాపారవేత్త పరిచయం అయ్యాడు. ముంబై అంధేరిలోని జిమ్ లో వీరు కలుసుకునేవారు. కొన్ని రోజుల్లోనే పరిచయం కాస్తా మంచి స్నేహంగా మారింది. 

దీంతో, తన వ్యాపారం గురించి రిమీకి వ్యాస్ చెప్పాడు. తాను కొత్త వెంచర్ ప్రారంభిస్తున్నానని... తన పార్ట్ నర్ గా మారితే మంచి లాభాలు వస్తాయని నమ్మించారు. అతని మాటలు నమ్మిన రిమీ పెట్టుబడి కింద రూ. 4.14 కోట్లు ఇచ్చింది. అయితే డబ్బు తీసుకున్న కొన్ని రోజుల తర్వాత అతను కనిపించలేదు. ఆరా తీస్తే అతను ఏ వ్యాపారాన్ని ప్రారంభించలేదని తెలిసింది. 

దీంతో తాను దారుణంగా మోసపోయానని ఆమెకు అర్థమయింది. చేసేదేమీ లేక చివరకు పోలీసులను ఆశ్రయించింది. అతన్ని పట్టుకుని తన డబ్బులు తిరిగి ఇప్పించాల్సిందిగా పోలీసులను కోరింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వ్యాస్ కోసం గాలిస్తున్నారు.

More Telugu News