Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ కు యూఏఈలో అనుమతి.. విమర్శకులపై విరుచుకుపడ్డ అగ్నిహోత్రి

  • ఇది మానవత్వాన్ని చూపించే సినిమా
  • 4 వారాల పరిశీలన తర్వాత ఇస్లామిక్ దేశంలో అనుమతి
  • ఏప్రిల్ 7న విడుదల చేస్తాం
  • త్వరలో సింగపూర్ లోనూ విడుదల
  • ప్రకటించిన సినిమా దర్శకుడు
The Kashmir Files cleared without cuts in UAE

ఎన్నో వివాదాలు, విమర్శలు, ప్రశంసలకు కేంద్రమైన ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా యూఏఈలో ప్రదర్శనకు అనుమతి సంపాదించుకుంది. కశ్మీరీ పండిట్లపై ముస్లిం టెర్రరిస్టులు సాగించిన దమనకాండ నేపథ్యంలో నిర్మించిన ఈ సినిమాకు .. ఇస్లామిక్ దేశమైన యూఏఈలో అనుమతి లభించడం ఈ సినిమా బృందం సాధించిన పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. 

రూ.250 కోట్ల భారీ కలెక్షన్లతో బాలీవుడ్ లో కశ్మీర్ ఫైల్స్ ఘన విజయాన్నే నమోదు చేసుకుంది. యూఏఈలో అనుమతి వచ్చిన నేపథ్యంలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి విమర్శకులపై విరుచుకుపడ్డారు. ‘‘నాలుగు వారాల సూక్ష్మ పరిశీలన అనంతరం ఇస్లామిక్ దేశం సినిమా ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. కానీ, కొందరు భారతీయులు దీన్ని ఇస్లామోఫోబియాగా అభివర్ణిస్తున్నారు’’ అని అగ్నిహోత్రి పేర్కొన్నారు. 

యూఏఈలో ఎటువంటి సెన్సార్ కోతలు లేకుండా అనుమతి లభించడం గమనార్హం. త్వరలోనే ఈ సినిమాను సింగపూర్ లో విడుదల చేయనున్నారు. ‘‘ఇది పెద్ద విజయం. మొత్తానికి యూఏఈలో సెన్సార్ అనుమతి లభించింది. ఎటువంటి కోతలు లేకుండానే 15 ప్లస్ రేటింగ్ ఇచ్చారు. ఏప్రిల్ 7న విడుదల చేయనున్నాం’’ అంటూ అగ్నిహోత్రి ట్వీట్ చేశారు. 

కశ్మీర్ ఫైల్స్ మానవత్వానికి సంబంధించిన కథనంగా అగ్నిహోత్రి పేర్కొన్నారు. ‘‘సింగపూర్ లోనూ అదే చోటు చేసుకుంది. మూడు వారాలు పట్టింది. ముస్లిం గ్రూపుల నుంచి ఎన్నో వినతులు వచ్చాయి. సినిమాలో అభ్యంతరకరమైనవి ఏవీ లేవంటూ అందరూ చూడతగినదిగా అక్కడి సెన్సార్ చీఫ్ స్పష్టం చేశారు’’అని వివరించారు.

More Telugu News