AAP: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటిపై బీజేవైఎం దాడి.. ఖండించిన ఆప్‌

  • బారికేడ్లు, సీసీటీవీల ధ్వంసం
  • కేజ్రీ ఇంటి గోడ‌ల‌పై కాషాయ రంగు చ‌ల్లిన ఆందోళ‌న‌కారులు
  • బీజేవైఎం అధ్య‌క్షుడు తేజ‌స్వీ సూర్య ఆధ్వ‌ర్యంలోనే దాడి
  • ప‌లువురిని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
bjym attacks delhi cm kefriwal house

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఇంటిపై గురువారం బీజేపీ యువ‌జ‌న విభాగం బీజేవైఎం శ్రేణులు దాడికి దిగాయి. 200 మందిదాకా బీజేవైఎం కార్య‌క‌ర్త‌లు కేజ్రీ ఇంటికి త‌ర‌లివెళ్లి..అక్క‌డ ఏర్పాటు చేసిన బారీకేడ్లు, సీసీటీవీ కెమెరాల‌ను ధ్వంసం చేశారు. బీజేవైఎం అధ్య‌క్షుడు, ఎంపీ తేజ‌స్వీ సూర్య ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ దాడిలో బీజేవైఎం శ్రేణులు కేజ్రీవాల్ ఇంటి గోడ‌ల‌పై కాషాయ రంగును చ‌ల్లారు. క‌శ్మీరీ పండిట్ల వెత‌ల‌పై ఇటీవ‌లే విడుద‌లైన ద క‌శ్మీర్ ఫైల్స్ చిత్రంపై కేజ్రీ చేసిన వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గానే ఈ దాడి జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

ఈ దాడిపై ఆప్ చాలా వేగంగానే స్పందించింది. ఎన్నిక‌ల్లో కేజ్రీవాల్‌ను ఓడించ‌లేని బీజేపీ ఇలా త‌మ కార్య‌క‌ర్త‌ల‌తో కేజ్రీ ఇంటిపై దాడికి పురికొల్పింద‌ని ఆరోపించింది. ఈ మేర‌కు ఆప్ కీల‌క నేత‌, ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా బీజేవైఎం దాడిని ఖండించారు. కేజ్రీ ఇంటిపై బీజేవైఎం శ్రేణుల దాడి దృశ్యాల‌ను కూడా ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశారు. కేజ్రీ ఇంటిపై దాడి జ‌రిగింద‌ని తెలుసుకున్న పోలీసులు హుటాహుటీన అక్క‌డ‌కు చేరుకుని బీజేవైఎం కార్య‌క‌ర్త‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News